-ఏపీ సీఎం జగన్ ను కూతురు పెళ్ళికి ఆహ్వానించిన పొంగులేటి
-ఖమ్మం నుంచి తాడేపల్లి వెళ్లి కలిసిన పెళ్లి పత్రిక అందించిన పొంగులేటి
సరదాగా మాట మంతి
-2014లో ఖమ్మం నుంచి వైసీపీ ఎంపీగా గెలిచిన వైనం
-ఆ తర్వాత వైసీపీని వీడి టీఆర్ఎస్లో చేరిన మాజీ ఎంపీ
-టీఆర్ఎస్లో ప్రాధాన్యం దక్కడం లేదని అసంతృప్తి
టీఆర్ యస్ కు చెందిన ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏపీ సీఎం జగన్ ను తాడేపల్లి లోని ఆయన నివాసంలో కలిశారు . శుక్రవారం ఖమ్మం నుంచి ప్రత్యేకంగా వెళ్లిన శ్రీనివాస్ రెడ్డి తన కూతురు పెళ్లి పత్రికను స్వయంగా సీఎం జగన్ కు అందించారు . తప్పకుండ పెళ్ళికి రావాలని కోరారు . అయితే ఆయన ఏపీ సీఎం ను కలవడం ఇదే మొదటిసారి కాకపోయినా ఆయన కలిసిన ప్రతిసారి పుకార్లు షికార్లు చేయడం ఆనవాయితీగా మారింది. ఆయన అనేక సందర్భాల్లో తనకు పార్టీ మారడంలేదని చెప్పినప్పటికీ టీఆర్ యస్ నుంచి ఎలాంటి హామీ లేకపోవడంతో ఆయన పార్టీ మారుతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారమే జరిగింది. వాటిని అన్నిటిని కొట్టివేస్తూ కేటీఆర్ ఖమ్మం వచ్చిన సందర్భంగా తన ఇంటికి ఆహ్వానించి భోజనం పెట్టారు . తరువాత టీఆర్ యస్ కార్యాలయంలో జరిగిన జిల్లా నేతల భేటీలో పొంగులేటి , తుమ్మలను ఎట్టి పరిస్థితిలోను పార్టీ వదులుకోదని చెప్పారు .
దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి బతికి ఉండగా అప్పుడప్పుడే రాజకీయాల్లోకి వచ్చిన పొంగులేటి… నాడు కడప ఎంపీగా ఉన్న వైఎస్ జగన్తో అత్యంత సన్నిహితంగా మెలిగారు. వైఎస్ఆర్ మృతి తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జగన్ వైఎస్సార్సీపీ పేరిట కొత్త పార్టీ నెలకొల్పగా… పొంగులేటి కూడా జగన్ బాటలోనే నడిచారు. 2014 ఎన్నికల్లో ఖమ్మం లోక్ సభ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పొంగులేటి విజయం సాధించారు. తనతో పాటు ఖమ్మం జిల్లా పరిధిలోని ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచేలా ఆయన పనిచేశారు.
అయితే రాష్ట్ర విభజన, క్రమంగా తెలంగాణలో వైసీపీ ప్రాభవం తగ్గుతున్న నేపథ్యంలో వైసీపీని వీడిన పొంగులేటి అధికార టీఆర్ఎస్లో చేరిపోయారు. అయితే 2019 ఎన్నికల్లో ఖమ్మం లోక్ సభ సీటును టీఆర్ఎస్ అధినేత కేసీఆర్… పొంగులేటికి కాకుండా టీడీపీ నుంచి వచ్చిన నామా నాగేశ్వరరావుకు ఇచ్చారు.
ఈ క్రమంలో తనకు టీఆర్ఎస్లో ప్రాధాన్యం దక్కడం లేదన్న భావనతో పార్టీ కార్యక్రమాలకు పొంగులేటి దూరంగా ఉంటున్నారు. అయితే అప్పుడప్పుడు టీఆర్ఎస్ కార్యక్రమాల్లో కనిపిస్తున్న ఆయన తాను టీఆర్ఎస్లోనే ఉంటున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో జగన్తో పొంగులేటి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.అయితే ఆయన కేవలం తన కూతురు వివాహానికి శుభలేఖ అందచేసేందుకు వెళ్లినట్లు సమాచారం …