వినయానికి ప్రతిరూపం ధన్కర్!.. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై మోదీ ప్రశంస!
- ధన్కర్ను రైతు బిడ్డగా అభివర్ణించిన మోదీ
- న్యాయవాదిగానే కాకుండా ప్రజా ప్రతినిధిగా రాణించారని ప్రశంస
- భారత రాజ్యాంగంపై ధన్కర్కు మంచి పట్టుందన్న ప్రధాని
![pm modi praises Jagdeep Dhankhar](https://i0.wp.com/img.ap7am.com/cdn-cgi/image/width=320,quality=85,f=auto/bimg/cr-20220716tn62d2dd1a4ee28.jpg?resize=320%2C213&ssl=1)
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఎన్నికైన పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆకాశానికెత్తేశారు. ధన్కర్ వ్యక్తిత్వాన్ని కీర్తిస్తూ శనివారం రాత్రి ట్విట్టర్ వేదికగా మోదీ రెండు వరుస ట్వీట్లు చేశారు.
ధన్కర్ను రైతు బిడ్డగా పరిచయం చేసిన మోదీ… వినయానికి ధన్కర్ ప్రతిరూపమని పేర్కొన్నారు. న్యాయవాదిగా, ప్రజా ప్రతినిధిగా ధన్కర్ అపార అనుభవాన్ని గడించారని మోదీ తెలిపారు. రైతులు, యువత, మహిళలు, అణగారిన వర్గాల అభివృద్ధి కోసం ధన్కర్ అవిశ్రాంత కృషి చేశారని ఆయన తెలిపారు.
భారత రాజ్యాంగంపై ధన్కర్కు మంచి పట్టు ఉందని మోదీ తెలిపారు. పార్లమెంటరీ వ్యవహారాలపైనా ధన్కర్కు అపార అవగాహన ఉందని పేర్కొన్నారు. రాజ్యసభ చైర్మన్గా ధన్కర్ అత్యుత్తమంగా రాణిస్తారన్న నమ్మకం తనకుందని మోదీ తెలిపారు. విభిన్న రంగాలపై అపార అనుభవం కలిగిన ధన్కర్ను ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడం తనకు సంతోషాన్నిచ్చిందని మోదీ పేర్కొన్నారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీకి ముందు తనను కలిసిన జగదీప్ ఫొటోలను మోదీ తన ట్వీట్లకు జత చేశారు.
ధన్కర్కు ముందస్తు అభినందనలు తెలిపిన అమిత్ షా
![amit shah wished Jagdeep Dhankhar in advance](https://i0.wp.com/img.ap7am.com/cdn-cgi/image/width=320,quality=85,f=auto/bimg/cr-20220716tn62d2ddffe155f.jpg?resize=320%2C213&ssl=1)
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీఏ అభ్యర్థిగా ఎంపికైన పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్కు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ముందస్తు అభినందనలు తెలిపారు. శనివారం సాయంత్రం సుదీర్ఘంగా జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో పలువురు నేతల పేర్లను పరిశీలించిన మీదట జగదీప్ ధన్కర్ను ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ఎంపిక చేసిన విషయం విదితమే.
ఈ ప్రకటన వెలువడినంతనే అమిత్ షా ఇంటికి జగదీప్ ధన్కర్ వెళ్లారు. ధన్కర్ను సాదరంగా ఆహ్వానించిన అమిత్ షా… ఆయనతో భేటీ అయ్యారు. అనంతరం ధన్కర్ విజయం ఖాయమేనంటూ ట్విట్టర్ వేదికగా అమిత్ షా ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. ఉపరాష్ట్రపతిగా ధన్కర్ ఎన్నికతో పార్లమెంటులో ఎగువ సభ ఔన్నత్యం మరింత పెరుగుతుందని తెలిపారు. ఫలితంగా దేశానికి మేలు జరుగుతుందని కూడా అమిత్ షా పేర్కొన్నారు.