మునుగోడులో గ్రామగ్రామానికి ఇంచార్జిలు ….టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి!
-మోడీకి గులాం గా మారిన గులాంనబీ ఆజాద్
-తెలంగాణను ఆక్రమించడానికి మోదీ.. దేశాన్ని ఆక్రమించడానికి కేసీఆర్ బయల్దేరారు
-మునుగోడు ఉప ఎన్నిక కోసం సెప్టెంబర్ 1 నుంచి క్షేత్ర స్థాయిలోకి వెళ్తున్నామన్న రేవంత్
-బీజేపీ, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను కొనుగోలు చేస్తున్నాయని ఆరోపణ
-కేసీఆర్ తెలంగాణ మోడల్ అంటే భూదోపిడీ, అవినీతా? అంటూ ప్రశ్న
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు పార్టీ ఫిరాయింపుల కమిటీలను ఏర్పాటు చేసుకున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రజాప్రతినిధులను కొనుగోలు చేస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేస్తున్నాయని విమర్శించారు. రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ప్రజా సమస్యలను పక్కదోవ పట్టిస్తున్నాయని అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక కోసం సెప్టెంబర్ 1వ తేదీ నుంచి క్షేత్ర స్థాయిలోకి వెళ్తామని రేవంత్ చెప్పారు. సెప్టెంబర్ 1 నుంచి గ్రామగ్రామానికి ఇన్ఛార్జీలను నియమిస్తామని తెలిపారు.
గాల్వన్ లోయలో చనిపోయిన సైనికులకు పరిహారం ఇస్తానంటూ వేరే రాష్ట్రానికి కేసీఆర్ వెళ్తున్నారని… మరి, తెలంగాణ నుంచి వెళ్లి ప్రాణాలు కోల్పోయిన సైనికుల కుటుంబాల పరిస్థితి ఏమిటని రేవంత్ ప్రశ్నించారు. తెలంగాణ మోడల్ అని కేసీఆర్ అంటుంటారని.. భూదోపిడీ, అవినీతే తెలంగాణ మోడలా? అని ప్రశ్నించారు.
తెలంగాణను ఆక్రమించడానికి మోదీ… దేశాన్ని ఆక్రమించడానికి కేసీఆర్ బయల్దేరారని ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో గులాం నబీ ఆజాద్ పై కూడా రేవంత్ విమర్శలు గుప్పించారు. రాజ్యసభ సీటు రెన్యువల్ కాలేదనే ఆయన పార్టీని వీడారని అన్నారు. మోదీకి గులాం నబీ ఆజాద్ గులాంలా మారారని ఎద్దేవా చేశారు. పార్టీని ఎవరు వీడిన కాంగ్రెస్ ఆదాయాలు సిద్ధాతంలు ఉంటాయని అన్నారు . దేశంకోసం త్యాగం చేసిన పార్టీ కాంగ్రెస్ అనేకమంది నాయకులూ ప్రాణాలు ,ఆస్తులు పోగొట్టుకున్నారని రేవంత్ రెడ్డి అన్నారు . దేశంలో భారీ ప్రాజెక్టులు ,పరిశ్రమలు తెచ్చిన పార్టీ కాంగ్రెస్ , పేదలకోసం అనేక పథకాలు ప్రవేశ పెట్టిన పార్టీ కాంగ్రెస్ ఇప్పటికి పేదల గుండెల్లో కాంగ్రెస్ ఉందని అన్నారు .