ఆదర్శ పాలన అందించిన చిర్రావూరి నిజాయితీకి నిలువెత్తు రూపం:సిపిఎం
తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొనని బిజెపికి సెప్టెంబర్ 17 గురించి మాట్లాడే అర్హతే లేదు
– 14వ వర్థంతి సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
ఖమ్మం మున్సిపల్ చైర్మన్గా 4 దశాబ్దాల పాటు ఆదర్శవంతమైన, నీతివంతమైన పాలనను చిర్రావూరి లక్ష్మినర్సయ్య అందించారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్రావు అన్నారు.
ఖమ్మం మున్సిపల్ మాజీ చైర్మన్, ఆదర్శ నేత చిర్రావూరి లక్ష్మీనర్సయ్య గారి 14వ వర్ధంతి సందర్భంగా మంగళవారం స్థానిక రైల్వే స్టేషన్ సర్కిల్లో ఉన్న చిర్రావూరి గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, రాష్ట్ర కమిటి సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, మున్సిపల్ మాజీ చైర్మన్, సిపిఎం జిల్లా కమిటి సభ్యురాలు అఫ్రోజ్ సమీనా, చిర్రావూరి గారి కుమారుడు అచ్యుతరావులు వున్నారు. తొలుత సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు గారు పార్టీ జెండాని ఆవిష్కరించారు.
అనంతరం రాష్ట్ర కమిటి సభ్యులు యర్రా శ్రీకాంత్ అధ్యక్షతన జరిగిన సభలో పోతినేని మాట్లాడుతూ, నేడు రాజకీయ నాయకులు పదవుల కోసం ఊసరవెల్లిలా పార్టీలు మారుతూ, ప్రజల గురించి పట్టించుకోవడం లేదని, కానీ చిర్రావూరి మాత్రం ఖమ్మం మున్సిపాలిటీ ఏర్పడిన రోజుల్లోనే సైకిల్పై వీధులు తిరుగుతూ, సామాన్యుడిలా ప్రజల్లో కలిసి స్వపరిపాలన అందించారని అన్నారు. తాను మున్సిపల్ చైర్మన్ అనే అహం ప్రదర్శించకుండా మౌలిక సదుపాయాలు కల్పించి పట్టణ ప్రజల గుండెల్లో నిలిచిన జననేత చిర్రావూరి అని కొనియాడారు. నేడు బీజేపీ తెలంగాణ సాయుధ పోరాటం గురుంచి మాట్లాడుతుంది కానీ అసలు తెలంగాణ సాయుధ పోరాటంలో ఆర్.యస్.యస్., బీజేపీలు ఆ పోరాటంలో ఎక్కడా పాల్గొనకుండా మాట్లాడటం విడ్డూరంగా ఉందని, ఎక్కడ పాల్గొన్నదో, ఎంత మంది జైలుకి వెళ్ళారో సమాధానం చెప్పాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులే అన్ని ఆయన పిలుపునిచ్చారు.
సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ కేవలం పట్టణ ప్రజానీకానికే కాకుండా నాడు నిజాం సర్కార్కు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని తెలంగాణను నిజాం నుండి విముక్తి చేసేందుకు పోరాటాలు నడిపిన కమ్యూనిస్టు యోధుడన్నారు. వరుసగా 4 దశాబ్దాల పాటు సుపరిపాలన అందించి స్వచ్ఛమైన పాలన అందించి ప్రజల మనసుల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించారన్నారు. చిర్రావూరి నడిచిన బాటనే తరువాత సిపిఎం పాలకవర్గాలు, ప్రజా ప్రతినిధులు నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతూనే వున్నారన్నారు. చిర్రావూరి ఆశయ సాధన అంటే దోపిడీ లేని సమాజ మార్పుకై పోరాడటమే అని అన్నారు. చిర్రావూరి స్ఫూర్తితో రానున్న కాలంలో ప్రజా పోరాటాలను ఉధృతంగా నడపాలన్నారు. ఆయన పేరు నేటికి ఖమ్మం పట్టణ ప్రజల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారన్నారు. పార్టీ జిల్లా కమిటి సభ్యులు ఎం.ఎ. జబ్బార్ వందన సమర్పణ చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండి రమేష్, వై. విక్రం, జిల్లా కమిటి సభ్యులు బండి పద్మ, యర్రా శ్రీనివాసరావు, మెరుగు సత్యనారాయణ, ఆర్.ప్రకాష్, జిల్లా నాయకులు ఎం.ఎ.ఖయ్యూం, ఎస్.కె.వి.ఎ.మీరా, నర్రా రమేష్, బేగం, అజిత, మెరుగు రమణ, భూక్యా శ్రీనివాస్, బండారు యాకయ్య, బోడపట్ల సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.