Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

పంటలకు ధరలేక రైతు విలవిలా …మద్దతు ధర చట్టం కోసం పోరాటం…

పంటలకు ధరలేక రైతు విలవిలా …మద్దతు ధర చట్టం కోసం పోరాటం…
* తెలంగాణలో ఏటా రూ.30వేల కోట్లు పత్తి రైతుకు నష్టం
* ఏపీలో ఒక సీజన్ లో రూ.14వేల కోట్లు వరి రైతుకు లాస్
* 9 పంటలను కిలో కూడా ప్రభుత్వం ఖరీదు చేయలేదు
* పంటల ఉత్పత్తి ఖర్చులు పెరిగినా ధరల్లో మాత్రం క్షీణత
* ఆలిండియా కిసాన్ సభ జనరల్ సెక్రటరీ విజ్జూ కృష్ణన్

పంటల ధరలేక రైతు విలవిలా లాడుతున్నాడని రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని అందువల్ల మద్దతు ధరల కోసం పోరాటానికి రైతాంగం సమాయత్తం కావాలని ఆల్ ఇండియా కిసాన్ సభ జనరల్ సెక్రెటరీ విజ్జూ కృష్ణన్ పిలుపునిచ్చారు. మద్దతు ధరలు లేక తెలంగాణలో ఏటా రూ. 30 వేల కోట్లు పత్తి రైతులు నష్టపోతున్నారని, ఆంధ్రప్రదేశ్లో ఒక సీజన్లో వరి రైతులు రూ.14వేల కోట్లు లాస్ అవుతున్నారని తెలిపారు. 9 పంటలను ప్రభుత్వం ఒక కిలో కూడా ఖరీఫ్ చేయట్లేదని పేర్కొన్నారు. పంట ఉత్పత్తి ఖర్చులు పెరిగినా ధరల్లో ఏమాత్రం పెరుగుదల లేని ఫలితంగానే రైతుల ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయని వాపోయారు. ఖమ్మంలోని సుందరయ్య భవనంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విజ్జూ కృష్ణన్ మాట్లాడారు. ‌ 2014లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు రకరకాల హామీలు ఇచ్చిందన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు తక్కువ ధరలకు ఇస్తామని, పంట రుణాలు, పంటల బీమా అమలు చేస్తామని ప్రకటించిందని వివరించారు. స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేస్తామని ప్రకటించింది అన్నారు. ఆమెను ఉపాధి హామీ పథకం కింద ఏడాదికి 200 పని దినాలు కల్పిస్తామని బీజేపీ చెప్పిందన్నారు. ఇవేవీ లేకపోవడంతో 9 ఏళ్లలో లక్షకు పైగా రైతుల ఆత్మహత్యలు చోటుచేసుకున్నాయని తెలిపారు. రెండున్నర లక్షల మంది వలస కార్మికులు బలవన్మరణాల పాలయ్యారని వివరించారు. మొత్తంగా నాలుగు లక్షల మంది రైతులు, కూలీలు ఆత్మహత్యల పాలైనా బిజెపి ప్రభుత్వానికి ఏమాత్రం చలనం లేదని స్పష్టం చేశారు. పంటల ఉత్పత్తి ఖర్చులు పెరుగుతున్న మద్దతు ధరలు మాత్రం పెరగడం లేదని పేర్కొన్నారు. ఇటీవల కేంద్రం ప్రకటించిన మద్దతు ధరల్లో వరికి క్వింటాల్ కు రూ.2,183, పత్తికి రూ.6,620 గా పేర్కొంది అన్నారు. స్వామినాథన్ కమిటీ సిఫారసుల ప్రకారం వరికి రూ.2,860 మద్దతు ధరగా తెలిపారు. ఏ పంటైనా ఉత్పత్తి ఖర్చుపై 50 శాతం పెంపుతో మద్దతు ధరలు ఉండాలని స్వామినాథన్ కమిటీ సిఫారసులు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. కానీ దీనికి భిన్నమైన పరిస్థితులు ఉండడంతో ఒక సీజన్లోనే రూ. 14 వేల కోట్లు ఆంధ్రప్రదేశ్ వరి రైతులు నష్టపోయిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణలో క్వింటా పత్తి ఉత్పత్తి ఖర్చు రూ.11వేలు కాగా కేంద్రం చెల్లిస్తుంది మాత్రం రూ. 6000 మాత్రమేనని తెలిపారు. ఇలా ప్రతి క్వింటాకు రూ.పదివేల వరకు పత్తి రైతులు నష్టపోతున్నారని, ఒక తెలంగాణలోనే ఏటా పతి రైతులు రూ. 30 వేల కోట్లు నష్టపోతున్నట్లు విజ్జూ కృష్ణన్ స్పష్టం చేశారు. అందుకే మద్దతు ధర కోసం ఓ చట్టం ఉండాలి.. ఆ చట్టం కోసం పోరాటం జరుగుతుందని పేర్కొన్నారు. రుణమాఫీ డిమాండ్ పై కేంద్రప్రభుత్వం స్పందించడం లేదన్నారు. 9 పంటలకు పది శాతం కూడా ఖరీదు లేదని తెలిపారు. విద్యుత్ చట్టంలోనూ మార్పులు తీసుకువచ్చిందని తెలిపారు. పైలెట్ ప్రాజెక్టుగా ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించారన్నారు. ఒక్క హెక్టారు పంట ఉత్పత్తికి నెలకు రూ . 7000 విద్యుత్ బిల్లు రైతులు చెల్లించాల్సి వస్తుందని వివరించారు. అటవీ పరిరక్షణ చట్టంలోనూ మార్పులు తీసుకొచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ మార్పులపై 2020 జరిగిన పోరాటంలో 750 మంది చనిపోయారని చెప్పారు. వీటన్నింటిపై సంయుక్త కిసాన్ మోర్చా పోరాటాలకు పిలుపునిచ్చిందని తెలిపారు. దీనిలో భాగంగా అన్ని రాష్ట్రాల్లోని ఎంపీలకు వినతి పత్రాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఆగస్టు 9న క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చామన్నారు. ఇప్పటికే ఏప్రిల్ 5 6 తేదీల్లో ర్యాలీలు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. సెప్టెంబర్ నుంచి పాదయాత్ర, జాతాలు, ర్యాలీలు నిర్వహిస్తామని వివరించారు. కార్మికులు, వ్యవసాయ కార్మికుల తో కలిసి ఐక్య ఉద్యమాలు నిర్మిస్తామన్నారు. సీసీఐ కొనగోళ్లతో పాటు కమర్షియల్ క్రాప్ బోర్డుల ఏర్పాటుకు డిమాండ్ చేశారు. కేరళలో కేంద్రం నిర్ణయించిన మద్దతు ధరపై క్వింటాకు రూ. 800 బోనస్ ఇస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. ‌ ఇవేవీ చేయకుండా కేంద్ర ప్రభుత్వం గో రక్షణ పేరుతో ముస్లిం, క్రిస్టియన్ల పై దాడులు చేస్తుందన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై ఈనెలాఖరు నుంచి ఉద్యమాలు చేపడతామని సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తెలిపారు. ఇంద్ర పంటల బీమా పథకం, పంట రుణాల మాఫీ, 35 నుంచి 40% ఉన్న కౌలు రైతులకు రైతుబంధు, రైతు బీమా, పంట నష్టపరిహారం వర్తింపజేయడం కోసం పోరాడుతామని వివరించారు. 11 లక్షల ఎకరాల పోడు రైతులకు, గిరిజనేతరులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వర్లు, సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యర్రా శ్రీకాంత్, భూక్యా వీరభద్రం, వై. విక్రమ్, కళ్యాణం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ‌

Related posts

బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో మమతా పార్టీ జోరు, రెండో స్థానంలో బీజేపీ!

Drukpadam

నేను ప్రజలు ఎన్నుకున్న సీఎంని.. నీవెవరు?: కేజ్రీవాల్ ఫైర్

Drukpadam

జమ్మూకశ్మీర్‌లో ఘోర ప్రమాదం… బస్సు లోయలో పడి 21 మంది మృతి…!

Ram Narayana

Leave a Comment