- ఐఎస్ఐకి అనుకూలంగా వ్యవహరించని నిజ్జర్
- కిరాయి నేరస్థులతో హత్యకు పథకం పన్నిన ఐఎస్ఐ
- ఆ మరక భారత్ పై పడేలా పాక్ గూఢచర్య సంస్థ కుట్ర
ఖలిస్థాన్ నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ వెనుక పాకిస్థాన్ ఐఎస్ఐ పాత్ర ఉన్నట్టు వెలుగు చూసింది. నిజ్జర్ హత్యకు ఐఎస్ఐ పథక రచన చేసినట్టు బయటపడింది. భారత్-కెనడా సంబంధాలను దెబ్బకొట్టడానికి పాకిస్థాన్ కు చెందిన గూఢచర్య సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ఈ పన్నాగం వేసినట్టు విశ్వసనీయ వర్గాలు భావిస్తున్నాయి. గడిచిన రెండేళ్లుగా పాకిస్థాన్ లోకి అడుగు పెట్టిన రౌడీ ముఠాలకు పూర్తి సహకారం అందించాలంటూ నిజ్జర్ పై ఐఎస్ఐ ఒత్తిడి తీసుకొచ్చినట్టు తెలిసింది. కానీ, ఐఎస్ఐ కోరినట్టు చేయకుండా, ఖలిస్థాన్ మాజీ నాయకుల వైపే నిజ్జర్ మొగ్గు చూపించినట్టు సమాచారం. దీంతో నిజ్జర్ హత్యకు నేరస్థులను ఐఎస్ఐ రంగంలోకి దింపింది.
నిజ్జర్ ను అడ్డు తొలగించడం వల్ల ఆ స్థానంలో మరో వ్యక్తిని కూర్చోబెట్టి, తాము చెప్పినట్టు ఆడించొచ్చన్నది ఐఎస్ఐ వ్యూహం. ఇప్పుడు నిజ్జర్ స్థానంలో మరో నేతను తెరపైకి తీసుకొచ్చేందుకు ఐఎస్ఐ ఏజెంట్లు కెనడాలో ఖలిస్థాన్ అనుకూల ఉగ్రవాదులు అందరినీ ఒక్కటి చేసే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది. అయితే, నిజ్జర్ హత్యోదంతంలో భారత్ ప్రభుత్వం ప్రమేయం ఉందన్న దానికి ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయని కెనడా ప్రధాని ట్రూడో స్వయంగా ప్రకటించడం గమనార్హం. ఈ కేసులో నిజమైన దర్యాప్తు జరిగితే కానీ, అసలు నిజం బయటకు రాదు.
ఆధారాలు ఇస్తే కెనడా దర్యాప్తునకు సహకరిస్తాం: జైశంకర్l
- ఖలిస్థాన్ నేత హత్యకు ఆధారాలు ఉంటే పంచుకోవాలన్న జైశంకర్
- భారత్ తప్పకుండా పరిశీలిస్తుందని స్పష్టీకరణ
- రాజకీయ ప్రయోజనాల కోసం ఉగ్రశక్తులకు మద్దతుగా నిలవొద్దని హితవు

కెనడాలో ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య దర్యాప్తులో భారత్ సహకరించాలంటూ అమెరికా చేసిన వినతి నేపథ్యంలో దీనిపై భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ బుధవారం అధికారికంగా స్పందించారు. ఖలిస్థాన్ నేత నిజ్జర్ హత్యకు సంబంధించి కెనడా నిర్దేశిత సమాచారాన్ని పంచుకుంటే భారత్ చర్యలు తీసుకుంటుందని జైశంకర్ ప్రకటించారు. కెనడా అందించే సాక్ష్యాలను పరిశీలించడానికి తాము సుముఖంగా ఉన్నట్టు చెప్పారు.
‘‘ఇది భారత ప్రభుత్వ విధానం కాదని కెనడియన్లకు చెప్పాం. మీ వద్ద ఏదైనా నిర్దేశిత సమాచారం ఉంటే అది మాకు తెలియజేయండి. దాన్ని పరిశీలిస్తాం’’ అని పేర్కొన్నారు. ఖలిస్థాన్ వేర్పాటువాద నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించిన సమాచారాన్ని ‘ఫైవ్ ఐస్’ దేశాల మధ్య పంచుకోవడంపై ప్రశ్న ఎదురు కాగా.. తాను ఫైవ్ ఐస్ లేదా ఎఫ్ బీఐలో భాగం కాదన్నారు. ఈ ప్రశ్నకు స్పందించడానికి తాను సరైన వ్యక్తిని కాదన్నారు. ఫైవ్ ఐస్ అనేది అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా, న్యూజిలాండ్ తో కూడిన ఐదు దేశాల ఇంటెలిజెన్స్ కూటమి.
నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయంపై కెనడా ప్రధాని ట్రూడో ఆరోపణలకు ఫైవ్ ఐస్ భాగస్వాముల మధ్య ఇంటెలిజెన్స్ సమాచారం పంచుకోవడం ఆధారంగా ఉన్నట్టు కెనడాలోని యూఎస్ రాయబారి డేవిడ్ కోహెన్ లోగడ తెలిపారు. దీంతో జైశంకర్ స్పందిస్తూ.. వ్యవస్థీకృత నేరాలు, వేర్పాటు వాద శక్తులు, హింసను రాజకీయ అవకాశ వాదంతో కెనడాలో అనుమతిస్తున్నట్టు విమర్శించారు.