Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

తమ్ముడూ మందకృష్ణా మాదిగ! 30 ఏళ్లు పోరాడావ్.. మీకు జరిగిన అన్యాయానికి ముగింపు పలుకుతా: ప్రధాని మోదీ హామీ

  • నా కుటుంబ సభ్యులారా… అంటూ ప్రధాని మోదీ ప్రసంగం
  • ప్రసంగం మధ్యలోను పలుమార్లు నా కుటుంబ సభ్యులారా అంటూ పలికిన ప్రధాని
  • బీజేపీ అంటే సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ అన్న ప్రధాని మోదీ
  • ఇంత విశాల సభను ఏర్పాటు చేసినందుకు నా తమ్ముడు మందకృష్ణకు ధన్యవాదాలు
  • బీఆర్ఎస్, కాంగ్రెస్ దళిత విరోధి అన్న ప్రధాని
  • దళిత ముఖ్యమంత్రిని చేస్తానని కేసీఆర్ మాట తప్పారని విమర్శ
  • రామ్ నాథ్ కోవింద్‌ను, ద్రౌపది ముర్ములను రాష్ట్రపతులుగా చేసింది బీజేపీయేనని వ్యాఖ్య
  • ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఉంటుందని హామీ
  • మీకు జరుగుతున్న అన్యాయానికి ముగింపు పలికేందుకు కట్టుబడి ఉన్నామన్న మోదీ
  • త్వరలో ఎస్సీ వర్గీకరణపై ఓ కమిటీ వేస్తామన్న ప్రధాని మోదీ


మందకృష్ణ మాదిగ చేస్తున్న వర్గీకరణ పోరాటానికి నేను సహకారిగా ఉంటానని, మీకు జరుగుతున్న అన్యాయానికి ముగింపు పలికేందుకు కట్టుబడి ఉన్నానని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. న్యాయం కోసం మీరు చేసే పోరాటానికి నేను కచ్చితంగా అండగా ఉంటానన్నారు. పరేడ్ మైదానంలో జరిగిన మాదిగ ఉపకులాల విశ్వరూప సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నా కుటుంబ సభ్యులారా.. అంటూ ప్రధాని ప్రసంగాన్ని ప్రారంభించారు. పండుగ సమయంలో మనకు కావాల్సిన వాళ్ల మధ్య ఉంటే ఆనందం రెట్టింపు అవుతుందని, ఇప్పుడు తనకు అలాగే ఉందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. మందకృష్ణ మాదిగ తనకు సోదరుడు అని, మీరంతా నా సోదరులే అన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన నా మాదిగ సోదర, సోదరీమణుల మధ్యకు రావడం తనకు ఆనందంగా ఉందన్నారు. పండుగ సమయంలో ఈ కుటుంబ సభ్యుల మధ్య గడుపుతుంటే తనకు పట్టలేని ఆనందంగా ఉందని, తనకు రెట్టింపు సంతోషంగా ఉందన్నారు. ఇంత పెద్ద విశాల సభను ఏర్పాటు చేసినందుకు నా తమ్ముడు మందకృష్ణ మాదిగకు ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు. ఈ సభకు తనను ఆహ్వానించినందుకు అందరికీ ధన్యవాదాలు అన్నారు.

మీ ఉద్యమంలో నేనూ ఉంటాను… 

నా కుటుంబ సభ్యులారా.. బీజేపీ అంటేనే సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ అన్నారు. తమ ప్రభుత్వం తొలి లక్ష్యం పేదరిక నిర్మూలన అన్నారు. బీజేపీ అణగారిన వర్గాల పక్షాన నిలిచిందన్నారు. గుర్రం జాషువా తన కష్టాలను కాశీ విశ్వనాధునికి విన్నవించుకున్నారని, ఇప్పుడు ఆ భగవంతుడి ఆశీస్సులతో తాను ఇప్పుడు ప్రధానిగా మీ ముందు ఉన్నానన్నారు. మందకృష్ణ మాదిగ ముప్పై ఏళ్లుగా ఒక లక్ష్యం కోసం ఉద్యమిస్తున్నారన్నారు. ఈ సమయంలో వేదికపై కూర్చున్న మందకృష్ణను.. తమ్ముడు కృష్ణా అంటూ పిలిచి.. ఇన్నాళ్లు మీరు పోరాడారు… మీ ఉద్యమంలో నేను కూడా ఉంటానని భరోసా ఇస్తున్నాను అని ప్రధాని మోదీ చెప్పారు. మీ బాధను పంచుకునేందుకు నేను ఇక్కడకు వచ్చానన్నారు. ఇన్ని రోజులు ఎంతోమంది రాజకీయ నాయకులు మీకు హామీ ఇచ్చి విస్మరించారని, ఆ రాజకీయ నాయకుల పక్షాన నేను క్షమాపణలు చెబుతున్నానన్నారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ దళిత విరోధి.. అంబేడ్కర్‌కు భారతరత్న ఇచ్చాం

పదేళ్ల క్రితం తెలంగాణ ఏర్పడినా ఇక్కడి ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. ఈ రోజు తెలంగాణ సంకట పరిస్థితిలో ఉందన్నారు. తెలంగాణ రాగానే సీఎం కేసీఆర్ బలిదానాలు చేసిన వారికి కాదని… కుటుంబ సమేతంగా వెళ్లి కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు చెప్పారని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ముఖ్యంగా మాదిగ సామాజిక వర్గానికి న్యాయం చేయలేదన్నారు. అధికారంలోకి రాగానే దళితుడిని ముఖ్యమంత్రిగా చేస్తానన్న కేసీఆర్ మాట తప్పారన్నారు. మీ కుర్చీని లాక్కున్నారన్నారు. మూడెకరాల భూమి ఇస్తానని ఇవ్వలేదన్నారు. రైతుబంధు ద్వారా ఎమ్మెల్యేలకు, వారి బంధువులకు మాత్రమే లాభం జరిగిందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ దళిత్ విరోధి అన్నారు. ఆ రెండు పార్టీలతో మాదిగలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాజ్యాంగాన్ని మారుస్తానని చెప్పి కేసీఆర్.. అంబేడ్కర్‌ను అవమానించారని, కాంగ్రెస్ అంబేడ్కర్‌ను రెండుసార్లు ఓడించారన్నారు. కానీ బీజేపీ హయాంలో పార్లమెంట్ సెంట్రల్ హాలులో అంబేడ్కర్ చిత్రపటం పెట్టామని, భారతరత్న ఇచ్చామన్నారు.

దళిత వర్గాలకు చెందిన రామ్ నాథ్ కోవింద్‌ను తాము రాష్ట్రపతిగా చేసిన సమయంలో కాంగ్రెస్ ఆయనను ఓడించే ప్రయత్నాలు చేసిందన్నారు. బీజేపీ తొలిసారి గిరిజన మహిళను రాష్ట్రపతిగా చేసిందన్నారు. జగ్జీవన్ రామ్‌ను కాంగ్రెస్ అవమానించిందన్నారు. రామ్ విలాస్ పాశ్వాన్, చిరాగ్ పాశ్వాన్, తదితరులకు పెద్ద పీట వేశామన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అంటే అవినీతికి మారుపేరు అన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీని కఠినతరం చేశామన్నారు. పేదలకు ఎన్నో రకాలుగా అండగా ఉంటున్నామన్నారు. తాము పెట్టిన అనేక పథకాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలే అత్యధిక లబ్ధిదారులన్నారు. ముద్ర లోన్ ద్వారా ఎక్కువగా లబ్ధి పొందిన వారిలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళలు ఉన్నారన్నారు.

మీ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తా

పేదరికం నుంచి వచ్చిన వ్యక్తిగా.. నేను ఉచిత రేషన్‌ను మరో అయిదేళ్లు పొడిగించానన్నారు. రైతులను ఆదుకోవడానికి కేంద్రం కొనుగోలు ధరను పెంచుతూ వెళ్తోందన్నారు. ఖరీఫ్ సీజన్‌లో 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. తెలంగాణ దళిత సామాజిక వర్గానికి చెందిన బంగారు లక్ష్మణ్‌తో కలిసి తాను పని చేశానన్నారు. బంగారు లక్ష్మణ్ వద్ద తాను ఎంతో నేర్చుకున్నానన్నారు. బంగారు లక్ష్మణ్‌ను తన గురువుగా భావిస్తున్నట్లు చెప్పారు. మందకృష్ణ మాదిగ 30 ఏళ్లగా మీ కోసం పోరాడుతున్నారన్నారు. మందకృష్ణ తన తమ్ముడి లాంటి వాడన్నారు. ఆయన తన యవ్వనాన్ని మీ కోసం ధారపోశారన్నారు. బంగారు లక్ష్మణ్ వద్ద నేను పని చేశానని.. అలాగే మాదిగ సమాజానికి జరిగిన అన్యాయాన్ని నేను గుర్తించానన్నారు. మందకృష్ణ నా చిన్న తమ్ముడే కాకుండా.. ఆయన ఆశయాలకు అనుగుణంగా నేను పని చేస్తానని హామీ ఇస్తున్నానని ప్రధాని మోదీ అన్నారు. ఇలాంటి మందకృష్ణ మాదిగకు జన్మనిచ్చినందుకు ఆయన తల్లిదండ్రులకు నమస్కరిస్తున్నానన్నారు.

ముప్పై ఏళ్ళుగా అహింసకు తావులేకుండా మీకు జరుగుతున్న అన్యాయంపై పోరాడారని, మీ ఉద్యమాన్ని నేను గుర్తించి, గౌరవిస్తున్నానన్నారు. హక్కుల కోసం మీ పోరాటాన్ని గుర్తించామని… త్వరలో ఎస్సీ వర్గీకరణపై ఓ కమిటీ వేస్తామన్నారు. మీ పోరాటానికి మా మద్దతు ఉంటుందన్నారు. మీకు జరిగిన అన్యాయానికి ముగింపు పలకడానికి మేం కట్టుబడి ఉన్నామన్నారు. భారత ప్రభుత్వం మీకు న్యాయం చేసేందుకు పని చేస్తుందన్నారు.

 పెద్దన్నా… మీరు వస్తున్నారంటే ఈ సమస్య పరిష్కారమైనట్లే!: మోదీపై మందకృష్ణ మాదిగ

  • నా జాతిని ఆదుకోవడానికి వచ్చారంటూ మోదీపై మందకృష్ణ మాదిగ
  • మీకు దణ్ణం పెడుతున్నాను… 30 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్నామన్న మందకృష్ణ
  • మీ మనసు వెన్నపూస… మీరు హామీ ఇస్తే ఎన్ని అవాంతరాలు వచ్చినా నెరవేర్చుతారన్న మందకృష్ణ
Manda Krishna Madiga on PM Narendra Modi in Viswarupa public meeting

‘పెద్దన్నా… మీరు వస్తున్నారంటే ఈ సమస్య (ఎస్సీ వర్గీకరణ) పరిష్కారమైనట్లే’నని నాతో చాలామంది చెప్పారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ… ప్రధాని నరేంద్రమోదీని ఉద్దేశించి అన్నారు. పరేడ్ మైదానంలో జరిగిన మాదిగ ఉపకులాల విశ్వరూప సభకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ… నా జాతిని ఆదుకోవడానికి వచ్చిన ప్రధాని మోదీ, మన వద్దకు ఆయనను తీసుకువచ్చిన కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, లక్ష్మణ్ అంటూ మందకృష్ణ ప్రసంగాన్ని ప్రారంభించారు. అన్నా… మీకు తమ్ముళ్లుగా మేం భావించుకుంటున్నాం.. మీకు దణ్ణం పెడుతున్నాను… 1994లో మాదిగ రిజర్వేషన్ పోరాట ఉద్యమం ప్రారంభమైందని, 30 ఏళ్లుగా తాను న్యాయం కోసం పోరాడుతున్నానని చెప్పారు.

మాదిగలకు అన్యాయం జరిగిందనే ఎస్సీ వర్గీకరణ కోరుకుంటున్నామన్నారు. లాల్ బహదూర్ శాస్త్రి కమిషన్, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు వేసిన కమిషన్లు కూడా మాదిగలకు అన్యాయం జరిగినట్లు చెప్పాయని, కానీ ఎవరూ న్యాయం చేయలేదని వ్యాఖ్యానించారు. మా వాటా మాకు దక్కాలని సుదీర్ఘ పోరాటం చేస్తున్నామన్నారు. అన్ని రాజకీయ పార్టీలు వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడుతున్నాయి.. కానీ హామీని మాత్రం నెరవేర్చలేదన్నారు. మాకు జరిగిన అన్యాయం ఇప్పుడు మీ ముందు పెడుతున్నామని, పండిట్ దీన్ దయాల్ చెప్పిన అంత్యోదయ, అంబేడ్కర్ చెప్పిన సమసమాజం… ఈ రెండింటికి ప్రతిరూపం వర్గీకరణ డిమాండ్ అన్నారు. కానీ ఇది ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు.

మీ మనసు వెన్నెపూస…

అన్నా.. మీ మనసు చాలా వెన్నపూస.. గుండె చాలా గట్టిది.. ఎన్నో అవాంతరాలు, అడ్డంకులు, నిందలను తట్టుకొని మీరు ప్రధానిగా… ప్రపంచనేతగా ఎదిగారని మోదీని ఉద్దేశించి అన్నారు. మీకు అంత గుండె నిబ్బరం ఉన్నప్పటికీ మీ మనసు మాత్రం చాలా మంచిది అన్నారు. మీ మనసు ఎంత మంచిదో పార్లమెంటులో చూశానని, కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ వీడ్కోలు సమయంలో చిరకాల మిత్రుడు అంటూ మీరు కన్నీరు కార్చారన్నారు.

మీరు ఎవరికో వ్యతిరేకమని చెబుతారు కానీ…

మీరు కొందరికి వ్యతిరేకమని చెబుతుంటారని.. ట్రిపుల్ తలాక్‌ను రద్దుచేసి ముస్లీంలను ఆదుకున్నది మీరే అన్నారు. ఈ దేశాన్ని ఆదుకున్న ప్రధానులలో మిమ్మల్ని మించిన వారు లేరన్నారు. మీ అన్నగా… తమ్ముడిగా.. మీకు సొంత తమ్ముడిగా నేను విజ్ఞప్తి చేస్తున్నానని, మీరు తల్చుకుంటే కానిది లేదన్నారు. మాకు వర్గీకరణ చేయాలన్నారు. మీరు ఈ విశ్వరూప సభకు వస్తున్నారంటేనే ఈ సమస్య పరిష్కారమైనట్లేనని చాలామంది నాతో చెప్పారన్నారు.

మోదీ హామీ ఇస్తే చాలు…

ప్రధాని నరేంద్రమోదీ హామీ ఇస్తే దానిని కచ్చితంగా చేస్తారని అందరికీ తెలుసునన్నారు. మోదీ హామీ ఇవ్వరు… ఇస్తే కనుక ఎంత కష్టమొచ్చినా.. ఆ మాటపై నిలబడతారన్నారు. ఇచ్చిన మాటపై నిలబడేందుకు ఎన్ని అడ్డంకులు వచ్చినా, అవాంతరాలు ఎదురైనా ఎదుర్కొంటారన్నారు. మీ నిజాయితీతో పాటు మీరు ఇచ్చిన మాట కచ్చితంగా చేస్తారని ప్రతిపక్ష పార్టీ నాయకులకు కూడా తెలుసునన్నారు. అందుకే మిమ్మల్ని తమ్ముడిగా కోరుతున్నానని.. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. దక్షిణాదిన బీజేపీపై కొంత దుష్ప్రచారం ఉందని, కానీ మీరు ఎస్సీ వర్గీకరణ చేస్తే దక్షిణాదిలో మెజార్టీ మాదిగలు మీ వెంట ఉంటారని మందకృష్ణ మాదిగ అన్నారు. మీరు వర్గీకరణ చేస్తే మీకు లక్ష్మణుడిగా తోడుగా ఉంటానన్నారు. 

మందకృష్ణ మాదిగ ఉద్వేగం

మందకృష్ణ మాదిగ ప్రసంగమంతా భావోద్వేగంతో చేశారు. చివరలో మాట్లాడుతూ… సభకు వచ్చిన మాదిగ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి… మనకు రాజకీయాలు ముఖ్యమా? జాతి ముఖ్యమా? ఈ పెద్దన్న (మోదీ) మన సమస్యను పరిష్కరిస్తే రాజకీయాలకు అతీతంగా మనం ఆయనకు శక్తిని ఇద్దామని పిలుపునిచ్చారు. నో కాంగ్రెస్.. నో బీఆర్ఎస్.. నో వేరే పార్టీ.. అన్న మోదీకి మద్దతిద్దామన్నారు. అన్నకు అండగా ఉందామన్నారు.

Related posts

50 రోజుల్లోనే రూ.1100 కోట్ల కుంభకోణం.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఆరోపణలు…

Ram Narayana

రాకేశ్ రెడ్డీ, మీరు కష్టపడ్డారు… ఫలితాలు ఎప్పుడూ ఆశించినట్లుగా ఉండవు: కేటీఆర్

Ram Narayana

వివేక్ కంపెనీకి రూ.8 కోట్ల నగదు బదలీ జరిగిందంటూ ఎన్నికల సంఘానికి బాల్క సుమన్ ఫిర్యాదు

Ram Narayana

Leave a Comment