- వివిధ అంశాలపై కాంగ్రెస్ తమ ప్రభుత్వాన్ని నిలదీసిందన్న వినోద్ కుమార్
- ఎన్నుకున్న ప్రజల పట్ల వినయంగా ఉండాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి హితవు
- టీడీపీ, కాంగ్రెస్ హయాంలోని నిర్మాణాలను మేం కూల్చివేశామా? అని ప్రశ్న
![Vinod Kumar lashes out at Revanth Reddy government](https://i0.wp.com/img.ap7am.com/bimg/cr-20231211tn6576d8dcb2672.jpg?w=1400&ssl=1)
Listen to the audio version of this article
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు… నిన్నటి వరకు ప్రతిపక్షంలో ఉన్నా కాంగ్రెస్ నాయకులు వివిధ అంశాలపై తమ ప్రభుత్వాన్ని నిలదీశారని, రానున్న రోజుల్లో తమను ఎత్తి చూపిన అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారని, వారి పట్ల ప్రభుత్వం వినయంగా ఉండాలని సూచించారు. గత ప్రభుత్వం హయాంలో నిర్మించిన భవనాలు, శిలాఫలకాలను కూల్చడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వం హయాంలో నిర్మించిన వాటిని కూలుస్తారా? అని మండిపడ్డారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం సరికాదని, అలాంటి ఘటనలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఫలకాలను కేసీఆర్ ప్రభుత్వం కూల్చివేసిందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ కూల్చివేత ధోరణి విపరీత చర్య అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలని నిలదీశారు.