అంతర్జాతీయం

మమ్మల్ని రెచ్చగొడితే అణుదాడి తప్పదు.. ఉత్తరకొరియా అధినేత హెచ్చరిక

  • ఖండాంతర క్షిపణి ప్రయోగం మాక్ డ్రిల్‌కు హాజరైన ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్
  • అనంతరం సైనికులను ఉద్దేశించి ప్రసంగం
  • శత్రువులు తమను అణుదాడితో రెచ్చగొడితే తామూ అదే రీతిలో స్పందిస్తామని వార్నింగ్
Kim Jong Un Warns Of Nuclear Attack when Enemy Provokes It With Nukes

ఉత్తరకొరియాను అణుదాడితో రెచ్చగొడితే తాము అణుబాంబు ప్రయోగానికి వెనకాడబోమని ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తాజాగా హెచ్చరించారు. గురువారం మిసైల్ బ్యూరో ఆధ్వర్యంలో ఖండాంతర బాలిస్టిక్ మిసైల్ క్షిపణి ప్రయోగం మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న  కిమ్..డ్రిల్‌కు హాజరైన సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన అణుదాడి హెచ్చరికలు చేసినట్టు ఉత్తరకొరియా వార్తా సంస్థ కేసీఎన్ఏ ఓ కథనాన్ని ప్రచురించింది. ప్రత్యర్థి అణుబాంబులతో రెచ్చగొడితే సంకోచించకుండా అణు బాంబు ప్రయోగించాలని మిసైల్ బ్యూరోకు కిమ్ సూచించినట్టు కేసీఎన్ఏ పేర్కొంది. చర్చల్లో బేషరతుగా పాల్గొనాలంటూ దక్షిణ కొరియా, దాని మిత్రదేశాలు కిమ్‌ను కోరిన నేపథ్యంలో ఈ హెచ్చరికలకు ప్రాధాన్యం ఏర్పడింది. 

గతవారం వాషింగ్టన్ డీసీలో అమెరికా, దక్షిణకొరియా మధ్య కీలక సమావేశం జరిగింది. ఉత్తరకొరియాతో యుద్ధం తలెత్తే పక్షంలో అణుబాంబు ప్రయోగ నివారణకు ఏం చేయాలనే దానిపై ఈ మీటింగ్‌లో చర్చ జరిగింది. కాగా, ఉత్తరకొరియా తమపై అణ్వస్త్రాలు ప్రయోగిస్తే కిమ్ పాలన అంతమైపోతుందంటూ ఉభయ దేశాలూ సమావేశం అనంతరం ఘాటు వ్యాఖ్యలు చేశాయి. ఎటువంటి ముందస్తు షరతులు లేకుండా శాంతి చర్చల్లో పాల్గొనాలని కిమ్‌కు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో ఉత్తరకొరియా అధ్యక్షుడి హెచ్చరికలకు ప్రాధాన్యం ఏర్పడింది.

Related posts

దావోస్‌లో బిజీబిజీగా సీఎం రేవంత్ రెడ్డి

Ram Narayana

అణుబాంబు పరీక్షలకు సిద్ధమవుతున్న చైనా?

Ram Narayana

గాజాపై ఇజ్రాయెల్ యుద్ధానికి ఏడాది.. వైట్‌హౌస్ వద్ద నిరసన తెలుపుతూ నిప్పుపెట్టుకున్న జర్నలిస్ట్..

Ram Narayana