Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

జైల్లో ఉన్న కవితను మళ్లీ అరెస్టు చేయడమేంటి?.. ఏమిటీ పీటీ వారెంట్​?

  • మద్యం కేసులో విచారించేందుకు కోర్టు అనుమతి తీసుకున్న సీబీఐ
  • జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లో ఉన్న కవిత
  • జైల్లో కవితను విచారించనున్న సీబీఐ

ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ నేడు అరెస్ట్ చేసింది. ఆమె ప్రస్తుతం ఈడీ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లో ఉన్నారు. ఇప్పటికే ఆమెను ఈడీ కస్టడీలోకి తీసుకొని విచారించింది. ఇప్పుడు సీబీఐ ఆమెను తీహార్ జైల్లోనే ప్రశ్నించనుంది.

సీబీఐ గత ఏడాది హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో విచారించింది. ఆమెను మరోసారి విచారించేందుకు రౌస్ అవెన్యూ ప్రత్యేక న్యాయస్థానంలో సీబీఐ అనుమతి తీసుకుంది. ఈ క్రమంలో ఆమెను ఈరోజు కస్టడీలోకి తీసుకుంది. కవితను పది రోజుల పాటు తమ కస్టడీకి కోరే యోచనలో సీబీఐ ఉంది. కాగా, కవిత రెగ్యులర్ బెయిల్‌పై ఈ నెల 16న కోర్టులో విచారణ జరగనుంది.

జైల్లో ఉన్న కవితను మళ్లీ అరెస్టు చేయడమేంటి?.. ఏమిటీ పీటీ వారెంట్​?

ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో ఇప్పటికే అరెస్టయి.. తీహార్ జైలులో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను.. తాజాగా సీబీఐ పీటీ వారెంట్ తో అరెస్టు చేసింది. మరి ఇప్పటికే అరెస్టయి జైలులో ఉన్న కవితను మళ్లీ అరెస్టు చేయడమేంటి? అసలు పీటీ వారెంట్ అంటే ఏమిటనే సందేహాలు ఉన్నాయా?.. వాటికి సమాధానాలివీ..

ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్ – పీటీ వారెంట్..

  • ఏదైనా కేసులో ఇప్పటికే అరెస్టయి జైలులో ఉన్న నిందితులను… మరో కేసులో అరెస్టు చేసేందుకు, లేదా అదే వ్యవహారంపై విచారణ జరుపుతున్న మరో దర్యాప్తు సంస్థ అరెస్టు చేసేందుకు వీలు కల్పించేదే ‘ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్’.
  • కోర్టు ఎవరినైనా జ్యుడిషియల్ రిమాండ్ కింద జైలుకు పంపినప్పుడు.. సదరు నిందితులు పూర్తిగా ఆ కోర్టు పర్యవేక్షణలోనే ఉన్నట్టు లెక్క. నిందితులు జైలులో ఉన్నా.. వారికి సంబంధించిన ఏ వ్యవహారమైనా వారిని రిమాండ్ కు పంపిన కోర్టు అనుమతితోనే చేయాల్సి ఉంటుంది.
  • ఆ నిందితులను వేరే కేసులో అరెస్టు చేయాల్సి వస్తే.. పోలీసులు సదరు కోర్టుకు వెళ్లి అనుమతి కోరుతారు. ఏ కేసులో, ఎందుకు అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నదో వివరిస్తారు. ‘ప్రిజనర్ ట్రాన్సిట్ వారంట్’ ఇచ్చి ఆ నిందితులను తమకు అప్పగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు.
  • కోర్టు దీనికి ఓకే చెప్పి ‘పీటీ వారంట్’ జారీ చేస్తే.. దానిని తీసుకెళ్లి జైలు అధికారులకు చూపించి.. సదరు నిందితులను తమ అదుపులోకి తీసుకుంటారు. తాము దర్యాప్తు చేయాల్సిన ఆ మరో కేసుకు సంబంధించిన వివరాలను సదరు నిందితుల నుంచి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. 

తిరిగి కోర్టులో హాజరు పర్చాల్సిందే..
పోలీసులు నిందితులను ట్రాన్సిట్ వారంట్ పై అరెస్టు చేసినా.. నిబంధనల ప్రకారం 24 గంటలలోగా తాము దర్యాప్తు చేస్తున్న ఆ మరో కేసుకు సంబంధించిన కోర్టులో హాజరుపర్చాల్సి ఉంటుంది. ఈ కోర్టు నిందితులకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తే.. ఈ కోర్టు పరిధిలోని జైలుకు తరలించాల్సి ఉంటుంది. ఒకవేళ పోలీసు కస్టడీకి ఈ కోర్టు అనుమతి ఇస్తే.. ఆ గడువు వరకు పోలీసులు నిందితులను తీసుకెళ్లి వివరంగా ప్రశ్నించేందుకు అవకాశం ఉంటుంది.

రెండు చోట్లా బెయిల్ వస్తేనే బయటికి..

  • ఇలా పీటీ వారంట్ పై ఉన్న నిందితులకు.. అన్ని కేసుల్లో బెయిల్ వస్తేనే జైలు నుంచి విడుదల అవుతారు. లేకుంటే జైల్లోనే ఉండాల్సి వస్తుంది.
  • ప్రస్తుతం కవితను తొలుత ఈడీ అరెస్టు చేసి.. రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చగా.. జ్యుడిషియల్ రిమాండ్ కింద తీహార్ జైలుకు పంపింది.
  • ఇప్పుడు ఆమెను సీబీఐ పీటీ వారంట్ పై అరెస్టు చేయడంతో.. ఆమెను సీబీఐ ప్రత్యేక కోర్టు ఎదుట హాజరుపరుస్తారు. ఆ కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ కింద ఏ జైలుకు పంపితే.. ఆ జైలుకు కవితను తరలిస్తారు. ఒకవేళ సీబీఐ కస్టడీకి ఇస్తే.. అధికారులు ఆమెను సీబీఐ కార్యాలయానికి తరలించి ప్రశ్నిస్తారు.
  • ఒకవేళ కవితకు ఈడీ కోర్టు బెయిల్ ఇచ్చినా.. సీబీఐ అరెస్టు నేపథ్యంలో జైలులోనే ఉండాల్సి ఉంటుంది. సీబీఐ కోర్టు కూడా బెయిల్ ఇస్తేనే ఆమె బయటికి విడుదల అవుతారు.

జైల్లో ఉన్న నన్ను సీబీఐ ఎలా అరెస్ట్ చేస్తుంది?: కోర్టులో కవిత పిటిషన్

తీహార్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న తనను సీబీఐ అదుపులోకి తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే జైల్లో ఉన్న తనను ఎలా అరెస్ట్ చేసిందంటూ అందులో పేర్కొన్నారు. ఈ మేరకు కవిత తరఫున న్యాయవాది మోహిత్ రావు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై అత్యవసరంగా విచారణ జరపాలని ఆయన కోర్టును కోరారు.

రిలీఫ్ ఇవ్వలేనన్న డ్యూటీ జడ్జి

ఈరోజు రంజాన్ కావడంతో డ్యూటీ జడ్జి మనోజ్ కుమార్ ఉన్నారు. కవిత తరఫున రాణా, మోహిత్ రావులు వాదనలు వినిపించారు. అయితే ఈ కేసు గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని జడ్జి మనోజ్ కుమార్ పేర్కొన్నారు. తన ముందు ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించిన విచారణ జరగలేదని తెలిపారు. కాబట్టి ఇందులో తాను ఎలాంటి రిలీఫ్ ఇవ్వలేనని స్పష్టం చేశారు. రేపు ఉదయం పది గంటలకు రెగ్యులర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని సూచించారు.

కాగా, కవితను గత నెల 15న ఈడీ హైదరాబాద్‌లోని ఆమె నివాసం నుంచి అరెస్ట్ చేశారు. ఢిల్లీ మద్యం కేసులో ఆమెను ఈడీ పది రోజుల పాటు విచారించింది. ఆ తర్వాత ఆమె తీహార్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఇలాంటి సమయంలో సీబీఐ ఆమెను తమ కస్టడీలోకి తీసుకుంది.

Related posts

వరుసగా ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి నిర్మలతో జగన్ భేటీ…

Drukpadam

ఢిల్లీ మేయర్ ఎన్నిక మళ్లీ వాయిదా!

Drukpadam

రాజస్థాన్ కాంగ్రెస్ కు తలనొప్పినాగా మారిన సచిన్ పైలెట్ వ్యవహారం…!

Drukpadam

Leave a Comment