Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

జర్నలిస్టుల గొంతుకగా నిలబడతా…ఎమ్మెల్సి అమెర్ అలీ ఖాన్

జర్నలిస్టుల గొంతుకగా నిలబడతా
-ఎమ్మెల్సి అమెర్ అలీ ఖాన్


ఓ పత్రికా సంపాదకుడిగా జర్నలిస్టుల కష్ట సుఖాలపై తనకు ఎంతో అవగాహన ఉందని, చట్టసభలో వారి గొంతుకగా నిలబడతానని ఎమ్మెల్సి, సియాసత్ ఉర్దూ దినపత్రిక సంపాదకులు అమెర్ అలీ ఖాన్ భరోసా ఇచ్చారు.
తెలంగాణ శాసన మండలి సభ్యులుగా ఇటీవల ఆయన బాధ్యతలు చేపట్టిన సందర్భంలో శుక్రవారం నాడు బషీర్ బాగ్ లోని టీయూడబ్ల్యూజే కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (TUWJ), హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (HUJ)ల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సత్కార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దాదాపు యాభై ఏళ్లుగా తమ కుటుంబానికి ఈ యూనియన్ తో సంబంధం ఉందని, నాడు తన తాత ఆబిద్ అలీ ఖాన్, తండ్రి జహేద్ అలీ ఖాన్, నేడు తాను యూనియన్ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాలుపంచుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. జర్నలిస్టులకు ఎలాంటి ఆపదవచ్చినా తనవంతు చేయూత అందిస్తానని అమెర్ అలీ ఖాన్ హామీ ఇచ్చారు.


సమావేశానికి అధ్యక్షత వహించిన టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కే.విరాహత్ అలీ మాట్లాడుతూ, సియాసత్ పత్రికా వ్యవస్థాపకులు ఆబిద్ అలీ ఖాన్ ఉమ్మడి రాష్ట్రంలోని తమ ఏపీయూడబ్ల్యూజే సంఘంలో క్రియాశీలక పాత్ర పోషించారని గుర్తుచేసారు. రాష్ట్ర అక్రెడిటేషన్ కమిటీలో తమ యూనియన్ ప్రతినిధిగా, ప్రెస్ అకాడమీ పాలకమండలి నియామక విధి విధానాల కమిటీ ఛైర్మన్ గా ఆయన కొనసాగారని విరాహత్ గుర్తుచేసారు. ప్రస్తుతం అమెర్ అలీ ఖాన్ ఎమ్మెల్సిగా నియామకం కావడం ఉర్దూ జర్నలిజానికి దక్కిన గౌరవంగా తాము భావిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు ఎం.ఏ.మాజీద్, టీయూడబ్ల్యూజే కార్యదర్శి వి.యాదగిరి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ.రాజేష్, తెలంగాణ చిన్న మధ్య తరగతి పత్రికల సంఘం అధ్యక్షులు యూసుఫ్ బాబు, హెచ్.యూ.జే అధ్యక్ష, కార్యదర్శులు శిగా శంకర్ గౌడ్, హమీద్ షౌకత్ లతో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.

Related posts

ఆగస్టు 15 న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన షడ్యూల్!

Ram Narayana

ఎమ్మెల్సీ చుట్టూ బిగుస్తున్న ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు!

Ram Narayana

జెమిని టీవీ సీరియల్ తారల చే ఖమ్మం లో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు

Ram Narayana

Leave a Comment