- అప్పటికప్పుడు బుల్డోజర్ ద్వారా చేసే న్యాయం వద్దన్న సుప్రీంకోర్టు
- చెరువులను ఆక్రమించిన నిర్మాణాలను కూల్చేస్తున్నామన్న రంగనాథ్
- హైడ్రా నేరస్తులు, నిందితుల ఆస్తుల జోలికి వెళ్లడం లేదని స్పష్టీకరణ
అప్పటికప్పుడు బుల్డోజర్ న్యాయం చేయడంపై ఇవాళ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో హైడ్రాకు వర్తించవని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు విచారణలో ఉన్న నేరగాళ్ళ ఇళ్లు, ప్రైవేటు ఆస్తుల పైకి బుల్డోజర్లను పంపిస్తున్నాయి. అయితే అప్పటికప్పుడు బుల్డోజర్ ద్వారా చేసే న్యాయం సరికాదని సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది.
తెలంగాణలో చెరువుల ఎఫ్టీఎల్ పరిధిలోని అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ క్రమంలో సుప్రీంకోర్టు తీర్పుపై రంగనాథ్ స్పందించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు హైడ్రాకు వర్తించవని తెలిపారు. యూపీలోని నేరస్థులు, నిందితుల ఇళ్ల కూల్చివేతలకు మాత్రమే ఆ ఆదేశాలు వర్తిస్తాయన్నారు. చెరువుల, నాలాలు, ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించి నిర్మించిన వాటిని మాత్రమే హైడ్రా కూల్చివేస్తోందని వెల్లడించారు.
నేరస్తుల, నిందితులకు సంబంధించిన ఆస్తుల జోలికి హైడ్రా వెళ్ళడం లేదన్నారు. బహిరంగ స్థలాలు, రైల్వే ఆస్తులు, నీటి వనరుల ఆక్రమణల తొలగింపులో తమ ఆదేశాలు వర్తించవని సుప్రీంకోర్టు స్వయంగా తెలిపిందని వెల్లడించారు. కాబట్టి ఈ ఆదేశాలు హైడ్రాకు వర్తించవన్నారు.
దేశవ్యాప్తంగా బుల్డోజర్ సంస్కృతిపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
- పలు రాష్ట్రాల్లో నేరస్తులు, సంఘ వ్యతిరేక శక్తుల ఇళ్ల కూల్చివేత
- బుల్డోజర్ న్యాయం పేరిట చర్యలను నిరసిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు
- విచారణ చేపట్టిన ద్విసభ్య ధర్మాసనం
- అక్టోబరు 1 వరకు బుల్డోజర్ చర్యలు వద్దన్న అత్యున్నత న్యాయస్థానం
దేశవ్యాప్తంగా బుల్డోజర్ సంస్కృతిపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ముందస్తు అనుమతులు లేకుండా బుల్డోజర్ చర్యలు వద్దని స్పష్టం చేసింది. అక్టోబరు 1 వరకు బుల్డోజర్ చర్యలు చేపట్టవద్దని ఆదేశించింది. అయితే, ఫుట్ పాత్ లు, రహదారుల ఆక్రమణలు, రైల్వే లైన్లు, జలవనరుల ఆక్రమణలపై చర్యలు తీసుకోవచ్చని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.
దేశంలోని పలు రాష్ట్రాల్లో, ముఖ్యంగా యూపీ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో సంఘ వ్యతిరేక శక్తులు, నేరగాళ్ల ఇళ్లను ప్రభుత్వాలు బుల్డోజర్లతో కూల్చివేస్తున్న ఉదంతాలు పెరుగుతున్నాయి. బుల్డోజర్ చర్యలకు వ్యతిరేకంగా జమాత్ ఉలేమా హింద్, తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ లతో కూడిన సుప్రీం ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది.
కూల్చివేతలకు ముందు నోటీసులు ఇవ్వాలని, నిబంధనలకు విరుద్ధంగా కూల్చినట్టయితే సంబంధిత అధికారులను బాధ్యులను చేయాలని పిటిషనర్లు కోర్టును కోరారు. కూల్చివేతలు ఆపేస్తే, ఆక్రమణల తొలగింపు ఆలస్యం అవుతుందన్న ప్రభుత్వ వాదనలను ద్విసభ్య ధర్మాసనం తోసిపుచ్చింది. యూపీ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు.
‘బుల్డోజర్ న్యాయం’ పేరిట చర్యలు చేపట్టడం హీరోయిజం అనిపించుకోదని, అక్టోబరు 1 వరకు కూల్చివేతలు ఆపినంత మాత్రాన కొంపలు మునిగిపోయే పరిస్థితులు ఏర్పడవని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అనంతరం తదుపరి విచారణను అక్టోబరు 1కి వాయిదా వేసింది.