- ట్రేడ్, సుంకాలు, ఇరుదేశాల మధ్య సంబంధాలపై చర్చ
- ప్రధాని మోదీ గ్రేట్ లీడర్ అన్న ట్రంప్
- శ్వేతసౌధంలో మళ్లీ ట్రంప్ ను చూడటం ఆనందంగా ఉందన్న మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం అమెరికా చేరుకున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనతో మోదీ సమావేశమవడం ఇదే తొలిసారి.
ట్రేడ్, సుంకాలు, ఇమిగ్రేషన్, ఇరుదేశాల మధ్య సంబంధాలు తదితర అంశాలపై వారిద్దరూ ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. మోదీ వెంట భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోభల్ కూడా ఉన్నారు. ఇక ఈ కీలక భేటీ అనంతరం ఇరువురు దేశాధినేతలు విలేకరులతో మాట్లాడారు.
ప్రధాని మోదీ మాట్లాడుతూ… “శ్వేతసౌధంలో మళ్లీ ట్రంప్ ను చూడటం ఆనందంగా ఉంది. 140 కోట్ల మంది భారతీయుల తరఫున ఆయనకు శుభాకాంక్షలు. మరో నాలుగేళ్లు ట్రంప్ తో కలిసి పని చేయనుండటం సంతోషంగా ఉంది. అగ్రరాజ్యం ప్రయోజనాలే ప్రధానంగా ట్రంప్ కృషి చేస్తారు. ఆయనలాగే నేను భారత్ ప్రయోజనాలు కాపాడటం గొప్ప అదృష్టం. భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం” అని మోదీ అన్నారు.
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ… “భారత్కు నరేంద్ర మోదీ లాంటి నేత ఉండటం గర్వకారణం. మోదీ నాకు చాలా ఏళ్లుగా మిత్రుడు. మా స్నేహాన్ని రానున్న నాలుగేళ్లు కొనసాగిస్తాం. మా ఇద్దరి మధ్య గొప్ప ఐక్యత ఉంది. దేశాలుగా భారత్, యూఎస్ కలిసి ఉండటం చాలా ముఖ్యం.
ప్రపంచంలో ఏ దేశానికి లేని విధంగా మాకు ఆయిల్, గ్యాస్ లాంటి చమురు వనరులు అందుబాటులో ఉన్నాయి. అవి ఇండియాకు కావాలి. మేం మంచి చేయాలని చూస్తున్నాం. ఎవర్నీ ఓడించాలనుకోవట్లేదు. అమెరికా ప్రజల కోసం అద్భుతంగా పని చేస్తాం. భారత్ తో స్నేహాన్ని ఇలాగే కొనసాగిస్తాం. అందులో ఎటువంటి మార్పు ఉండదు” అని ట్రంప్ చెప్పుకొచ్చారు.
ట్రంప్ తో భేటీలో అక్రమ వలసలపై మోదీ సంచలన వ్యాఖ్యలు…

- చట్టవిరుద్ధంగా ప్రవేశించిన వారికి ఆ దేశంలో ఉండే హక్కు ఉండదన్న ప్రధాని
- అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను వెనక్కి తీసుకొస్తామని ప్రకటన
- అగ్రరాజ్యం అధ్యక్షుడితో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన మోదీ
అక్రమ వలసలు ప్రపంచంలోని ఏ దేశానికైనా సమస్యేనని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఎవరైనా సరే ఓ దేశంలోకి అక్రమంగా ప్రవేశించి, అక్కడే సెటిలవుతామని అంటే కుదరదని స్పష్టం చేశారు. చట్టవిరుద్ధంగా అడుగుపెట్టిన వారికి ఆ దేశంలో ఉండే హక్కు ఉండదని తేల్చిచెప్పారు. ఇది ప్రపంచంలోని ఏ దేశానికైనా వర్తిస్తుందని పేర్కొన్నారు. అమెరికాలోకి అక్రమ వలసలపై మాట్లాడుతూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. అగ్రరాజ్యంలో అక్రమంగా ఉంటున్న భారతీయులను వెనక్కి తీసుకొస్తామని, ఈ విషయంలో ప్రెసిడెంట్ ట్రంప్ కు సహకరిస్తామని చెప్పారు.
అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన భారతీయుల్లో చాలామంది హ్యూమన్ ట్రాఫికింగ్ బారిన పడ్డవారేనని మోదీ చెప్పారు. కొంతమంది స్వార్థపరులు ఉద్యోగాలు, డాలర్ల ఆశజూపి అమాయకులను మోసం చేస్తున్నారని చెప్పారు. వారి మాయమాటలు నమ్మి అడ్డదారుల్లో యువత, పేదరికంతో బాధపడుతున్న వారు అక్రమ వలసదారులుగా మారుతున్నారని వివరించారు. ఏం జరుగుతోందో, ఏంచేస్తున్నామో తెలియకుండానే వారు ఈ అక్రమ రవాణా కూపంలోకి అడుగుపెడుతున్నారని తెలిపారు. ఈ దారుణాలను సమూలంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా భారత్ ప్రయత్నిస్తుందని, దీనికి ట్రంప్ సహకారం అందిస్తారని ఆశిస్తున్నట్లు మోదీ తెలిపారు.