- ఆలస్యంగా వెలుగుచూసిన అంశం
- సవరించేందుకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం
- ఉనికిలో లేని శాఖకు మంత్రి ఉండటంపై బీజేపీ విమర్శలు
పంజాబ్లో ఆసక్తికర అంశం ఆలస్యంగా వెలుగు చూసింది. ఉనికిలో లేని ఒక శాఖకు పంజాబ్లో ఓ మంత్రి సుమారు 20 నెలల పాటు బాధ్యతలు నిర్వర్తించారు. దీనిని సవరించేందుకు పంజాబ్ ప్రభుత్వం తాజాగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది.
పంజాబ్లో 2022 మార్చిలో భగవంత్ మాన్ నేతృత్వంలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఏర్పడింది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా 2023 మే నెలలో కుల్దీప్సింగ్ ధలివాల్కు రెండు శాఖలు కేటాయించారు. ఒకటి ఎన్నారై వ్యవహారాలు, రెండోది అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ డిపార్ట్ మెంట్. 2024 చివరలో మరోసారి పునర్వ్యవస్థీకరణ జరిగింది. ఆ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్ను విడుదల చేసింది.
అయితే, దీనిని తాజాగా సవరించింది. కుల్దీప్సింగ్కు కేటాయించిన అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ శాఖ ఉనికిలో లేకపోవడం వల్ల సెప్టెంబర్లో ఇచ్చిన నోటిఫికేషన్లో మార్పులు చేస్తున్నట్లు అందులో పేర్కొంది.
లేని శాఖకు కుల్దీప్సింగ్ మంత్రిగా ఉన్న వ్యవహారంపై బీజేపీ విమర్శలు గుప్పించింది. పంజాబ్లో పాలనను ఆమ్ ఆద్మీ ప్రభుత్వం జోక్గా మార్చివేసిందని విమర్శించింది. ఉనికిలో లేని శాఖకు మంత్రిగా 20 నెలలు ఉండటం విడ్డూరమని ఆగ్రహం వ్యక్తం చేసింది. లేని శాఖను ఒక మంత్రి నిర్వహిస్తున్నారనే విషయం ముఖ్యమంత్రికి తెలియదంటే పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని విమర్శించింది.