- మహారాష్ట్రలోని పూణెలో ఘటన
- ‘అక్కా’ అని మాటలు కలిపి అఘాయిత్యం
- నిందితుడిపై ఇప్పటికే పలు కేసులు
- రంగంలోకి 8 ప్రత్యేక పోలీసు బృందాలు
- దురదృష్టకర ఘటనగా పేర్కొన్న అజిత్ పవార్
- నిందితుడిపై కఠిన చర్యలకు సీఎం ఆదేశించారన్న డిప్యూటీ సీఎం
- ఢిల్లీ నిర్భయ ఘటనను తలపించిందన్న కాంగ్రెస్ మహారాష్ట్ర చీఫ్
మహారాష్ట్రలోని పూణెలో దారుణం జరిగింది. బస్టాండ్లో బస్సు కోసం వేచి చూస్తున్న యువతి (26)తో మాటలు కలిపిన ఓ వ్యక్తి ఆపై ఆమెను ఖాళీగా ఉన్న బస్సులోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మహారాష్ట్రలోని అతిపెద్ద బస్టాండ్లలో ఒకటైన స్వర్గేట్ బస్టాండ్లో మొన్న ఉదయం ఆరు గంటల సమయంలో జరిగిందీ ఘటన. బస్టాండ్కు 100 మీటర్ల దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉండటం గమనార్హం.
పోలీసుల కథనం ప్రకారం.. బాధిత యువతి సతారా జిల్లాలోని తన స్వగ్రామం ఫల్టాన్ వెళ్లేందుకు బస్సు కోసం వేచి చూస్తోంది. ఆమె ఒంటిగా ఉన్న విషయాన్ని గమనించిన నిందితుడు ‘అక్కా’ అని సంబోధిస్తూ మాటలు కలిపాడు. ఆమె ఎక్కడికి వెళ్లేదీ తెలుసుకున్నాడు. ఆ గ్రామానికి వెళ్లే బస్సు ఇక్కడ ఆగదని, మరో చోట ఉందని చెప్పి బస్ స్టేషన్లో దూరంగా నిలిపి ఉంచిన బస్ వద్దకు తీసుకెళ్లాడు. అనంతరం బస్సు ఎక్కాలని చెప్పగా, బస్సులో లైట్లు ఆఫ్ చేసి ఉండటంతో ఆమె అనుమానించింది. అది గమనించిన నిందితుడు బస్సులో ప్రయాణికులు ఉన్నారని, నిద్ర పోతుండటంతో లైట్లు ఆఫ్ చేశారంటూ బలవంతంగా ఆమెను బస్సు ఎక్కించాడు. ఆపై తనూ ఎక్కి తలుపు వేసి లైంగికదాడికి పాల్పడ్డాడు.
ఆ తర్వాత బాధితురాలు తన ఊరు వెళ్లాల్సిన బస్సు ఎక్కింది. అదే బస్సులో తన స్నేహితురాలిని చూసి జరిగిన విషయం చెప్పింది. పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆమె చెప్పడంతో వెంటనే బస్సు దిగి పోలీస్ స్టేషన్కు చేరుకుని జరిగిన దారుణాన్ని వివరించింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బస్ స్టేషన్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి నిందితుడిని దత్తాత్రేయ రామదాస్ (36)గా గుర్తించారు. అతడిపై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయని, 2019 నుంచి బెయిలుపై ఉన్నాడని పోలీసులు తెలిపారు. అతడిని పట్టుకునేందుకు 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు.
ఈ ఘటనపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ స్పందించారు. ఇదొక దురదృష్టకర ఘటన అని, బాధాకరమని పేర్కొన్నారు. ఈ ఘటన సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దృష్టికి వెళ్లడంతో నిందితుడిపై కఠిన చర్యలకు ఆదేశించారని తెలిపారు. వీలైనంత త్వరగా నిందితుడిని పట్టుకుంటామని పేర్కొన్నారు.
కాగా, ఈ ఘటనపై ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించాయి. రాష్ట్రంలో నేరాలను అదుపు చేయడంలో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ విఫలమయ్యారని ఆరోపించాయి. ఈ ఘటన 2012లో ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటనను తలపించిందని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ హర్షవర్ధన్ సప్కాల్ ఆవేదన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలోని బీజేపీ సారథ్యంలోని కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచితాలు ఇస్తూ వారి భద్రతను గాలికి వదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఈ ఘటనను నిరసిస్తూ శివసేన (యూబీటీ) నేత వసంత్ మోరే, ఇతర నాయకులు స్వర్గేట్ బస్ స్టేషన్కు చేరుకుని నిరసన తెలిపారు. కిటికీలను ధ్వంసం చేశారు.