- టీటీడీలో పునరుద్దరించబడిన తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిపార్సుల వీఐపీ బ్రేక్ దర్శనాలు
- ఆదివారం టీటీడీకి 90 మంది తెలంగాణ ప్రజా ప్రతినిధుల నుండి సిఫార్సు లేఖలు
- సోమవారం వీరికి వీఐపీ బ్రేక్ దర్శనాలను కల్పించారు
తిరుమల శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సులను అనుమతించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో తొలి రోజే పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజా ప్రతినిధుల నుంచి సిఫార్సు లేఖలు అందాయి. ఆదివారం ఒక్క రోజే 90 మంది ప్రజా ప్రతినిధులు ఈ సిఫార్సు లేఖలను జారీ చేశారు. ఈ సిఫార్సు లేఖలను నిన్న అదనపు ఈవో కార్యాలయ అధికారులు స్వీకరించారు. వీరికి ఈ రోజు (సోమవారం) వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించారు.
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, తిరుమలలో శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను టీటీడీ అనుమతించలేదు. దీంతో తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించాలని ఏపీ ప్రభుత్వానికి ఆ ప్రాంత ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు తరచుగా విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. వీరి విజ్ఞప్తిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారు. దీంతో శ్రీవారి దర్శనం కోసం తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను స్వీకరించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. మార్చి 24 (ఈరోజు) నుంచి గతంలో నిలిచిపోయిన ఈ సౌకర్యాన్ని పునరుద్ధరించారు.