- రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
- సూర్య తండాలో దెబ్బతిన్న బొప్పాయి తోటల పరిశీలన

అకాల వర్షాల వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 25 వేల ఎకరాలలో పంట నష్టం జరిగిందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. గత రెండు, మూడు రోజులుగా కురిసిన వడగళ్ళ వాన, అకాల వర్షాలకు నష్ట పోయిన పంటలపై కలెక్టర్లు నివేదికలు పంపారని తెలిపారు. శుక్రవారం మంత్రి తుమ్మల నాగేశ్వర రావు రఘునాధపాలెం మండలంలోని సూర్య తండాలో అకాల వర్షం, తీవ్రమైన గాలులకు దెబ్బతిన్న బొప్పాయి తోటలను ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాల వర్షాల వల్ల పంట నష్ట పోయిన రైతులకు తాత్కాలిక సహాయం అందిస్తూ, ఏప్రిల్, మే నెలలో వచ్చే రాళ్ళ వానలకు పంట నష్ట పోకుండా ఉండాలంటే ఆ కాలంలో తగిన పంటలు సాగు చేయాలని మంత్రి తెలిపారు. బొప్పాయి, మిర్చి, మొక్కజొన్న పంటలతో నష్ట పోతున్నాయని, ప్రభుత్వం అందించే పరిహారం సరి పోవడం లేదని, రైతులు నష్ట పోకుండా ఉండాలంటే పంట కాలం, పంటలు మార్చుకోవాలని మంత్రి సూచించారు. ఆయిల్ పామ్ వేసిన రైతులు అకాల వర్షాలతో నష్ట పోవడం లేదని, రైతులందరూ ఆలోచన చేసి లాభసాటి పంటలు సాగు చేయాలని అన్నారు. పంట మార్పిడి విధానం తప్పని సరిగా అమలు చేయాలన్నారు. నష్టం జరిగిన రైతులకు తాత్కాలికంగా ప్రభుత్వం తరఫున సహాయం అందిస్తామని, భవిష్యత్తులో ఇటువంటి నష్టాలు జరగకుండా చూసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ పర్యటనలో జిల్లా ఉద్యానవన అధికారి ఎం.వి. మధుసూదన్, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
