ఆదివారం తెల్లవారు జామున మీర్ చౌక్లోని గుల్జార్ హౌస్లో (Gulzar House) భారీ అగ్నిప్రమాదం జరిగింది. భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగడంతో 17 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయ పడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపు చేశారు. గాయపడిన వారిని మలక్ పేట యశోద, హైదర్గూడ అపోలో, డీఆర్డీఎల్ అపోలో, ఉస్మానియా, నాంపల్లి కేర్ హాస్పిటళ్లకు తరలించారు. ఘటనా స్థలంలోనే ముగ్గురు మరణించగా, మిగిలిన వారు దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
మృతులు..
అగ్ని ప్రమాదంలో మరణించిన వారిని ఆరుషి జైన్ (17), షీతల్ జైన్ (37), సుమిత్ర (65), మున్ని బాయి (72), ప్రథమ్ (13), అభిషేక్ మోడీ (30), రాజేంద్ర కుమార్ (67), ఇరాజ్ (2), ఫ్రియాన్షి (6), హర్షలి గుప్తా (7), ఇదిక్కి (4), అన్య (3), పంకజ్ (36), వర్ష (35), రజని అగర్వాల్ (32), రిషభ్ (4), ప్రీతం అగర్వాల్ (1)గా గుర్తించారు.
ముఖ్యమంత్రి ఆరా..
గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పోలీస్, ఫైర్ విభాగం చేపడుతన్న చర్యలను ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు. గాయపడిన వారిని వెంటనే హాస్పిటల్స్కు తరలించి మెరుగైన వైద్య సాయం అందించాలని ఆదేశించారు. బాధితులకు అండగా ఉంటామన్నారు. బాధితులతో ఫోన్లో మాట్లాడారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం
దీంతో అగ్నిప్రమాద ఘటనా స్థలాన్ని డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ప్రమాద కారణాలపై అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి, సౌత్జోన్ డీసీపీ స్నేహా మిశ్రా నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉదయం 6.16 గంటల సమయంలో ఫైర్ సిబ్బందికి సమాచారం అందిందని చెప్పారు. వెంటనే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారని మంటలను ఆర్పేశారు. అగ్నిప్రమాదంలో 17 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారని వెల్లడించారు. వారిలో ఎక్కువ మంది మరణించారని తెలిపారు. బాధితులకు ప్రభుత్వం తరఫున అండగా ఉంటామన్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సీఎం ఆదేశారని తెలిపారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తామన్నారు. అగ్ని ప్రమాదంలో కుట్ర కోణం లేదని, ప్రమాద వశాత్తు జరిగిందని చెప్పారు. ఏ అధికారి నిర్లక్ష్యం చేయకుండా ప్రమాద తీవ్రతను తగ్గించారు. చని పోయిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. చని పోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం సంతాపం తెలుపుతున్నది. ఘటనలో 17 మంది ఉన్నారని, ఎంతమంది చని పోయారనేది అధికారికంగా తెలియాల్సి ఉందని చెప్పారు.
గుండెలు పిండేసే దృశ్యం… బిడ్డలను హత్తుకుని అగ్నికీలలకు ఆహుతైన మహిళ!

- హైదరాబాద్ చార్మినార్ వద్ద ఘోర అగ్నిప్రమాదం
- ఒకే కుటుంబానికి చెందిన 17 మంది దుర్మరణం
- మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు, ఐదుగురు మహిళలు
మంటల బారి నుంచి తన కన్నబిడ్డలను కాపాడుకునేందుకు ఓ తల్లి చివరిశ్వాస వరకు వారిని తన కౌగిలిలోనే పొదివిపట్టుకుంది. ఆ చివరి ఆలింగనంలోనే ఆ తల్లి, బిడ్డలు సజీవదహనమయ్యారు. హైదరాబాద్లోని చారిత్రక చార్మినార్ సమీపంలో రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో వెలుగుచూసిన ఈ హృదయవిదారక దృశ్యం ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. ఈ పెను విషాదంలో ఒకే కుటుంబానికి చెందిన 17 మంది అగ్నికి ఆహుతయ్యారు, వీరిలో ఎనిమిది మంది చిన్నారులు, ఐదుగురు మహిళలు ఉన్నారు.
కళ్లారా చూసిన ఘోరం… స్థానికుడి ఆవేదన
ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యల్లో పాల్గొన్న గాజుల వ్యాపారి జాహిద్, ఆ భయానక దృశ్యాన్ని వివరిస్తూ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. “మంటలు ఎగిసిపడుతుండగానే మేము లోపలికి వెళ్లాం. ఒక గదిలో, ఆ తల్లి తన పిల్లలను మంటల నుంచి కాపాడేందుకు గట్టిగా హత్తుకుని ఉంది. ఆ కౌగిలిలోనే వారు కాలిపోయి కనిపించారు. ఆ దృశ్యం మమ్మల్ని తీవ్రంగా కలచివేసింది” అని జాహిద్ కన్నీటిపర్యంతమయ్యారు. తాము 13 మందిని బయటకు తీసుకువచ్చామని, అయితే దట్టమైన పొగ కారణంగా ఏమీ కనిపించలేదని, గోడ పగలగొట్టి లోపలికి వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. చాలా మంది మంటల్లో కాలిపోగా, మరికొందరు పొగతో ఊపిరాడక మరణించారని ఆయన వివరించారు.