- దండకారణ్యంలో భారీ ఎంకౌంటర్
- 28 మంది మావోయిస్టులు హతం
ఆపరేషన్ కగార్ దూకుడు పెరిగింది. దట్టమైన అడువుల్లో తుపాకులు గర్జిస్తున్నాయి. మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. భద్రతా బలగాలు వారిని రౌండప్ చేస్తూ హత మారుస్తున్నాయి. తాజాగా.. చత్తీస్గఢ్ నారాయణ పూర్ జిల్లా అడవుల్లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. బుధవారం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 28 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు పేర్కొంటున్నారు. ఈ ఎన్కౌంటర్లో ఒక జవాన్ మృతి చెందగా, ఇద్దరికి గాయాలయ్యాయి. వీరిలో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవ రాజు(67) మృతి చెందినట్లు తెలుస్తోంది. బసవరాజు ఉన్నారన్న సమాచారంతోనే మాధ్ ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టి ముట్టినట్లు సమాచారం. ఈ క్రమంలోనే మావోయిస్టులు, భద్రతా బలగాలకు ఎదురుకాల్పులు జరిగాయి. నంబాల కేశవరావు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా జియ్యన్నపేట. ఈయన తండ్రి ఉపాధ్యాయుడు. వరంగల్ ఆర్ఈసీలో ఇంజినీరింగ్ చదివారు. 1984లో ఎంటెక్ చదువుతూ పీపుల్స్ వార్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులయ్యారు. పీపుల్స్ వార్ వ్యవస్థాపకుల్లో నంబాల కేశవరావు ఒకరు. 2018లో గణపతి రాజీనామాతో మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 2010లో ఛత్తీస్గఢ్లో 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి ఘటనకు నంబాల సూత్రధారి. గెరిల్లా యుద్ధ వ్యూహాలు రచించడంలో కేశవరావు దిట్ట. ఐఈడీల వినియోగంలోనూ ఆయన నిపుణుడు. కేశవరావుపై రూ. 1.5 కోట్ల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
