- రాష్ట్రంలో రుతుపవనాలకు అకాల విరామం
- కొన్నిచోట్ల 40 డిగ్రీలకు చేరిన పగటి ఉష్ణోగ్రతలు
- జూన్ 10 తర్వాతే రుతుపవనాల్లో కదలిక
- రానున్న రెండు మూడు రోజులు వేడి వాతావరణమే
- సాయంత్రం వేళ అక్కడక్కడా ఈదురుగాలులతో వానలు
రాష్ట్రంలో వాతావరణం చిత్రవిచిత్రంగా మారింది. అందరూ ఊహించిన దానికంటే కాస్త ముందుగానే పలకరించిన నైరుతి రుతుపవనాలు ఒక్కసారిగా నెమ్మదించాయి. దీంతో ఆశించిన వర్షాలకు బ్రేక్ పడగా, మళ్లీ వేసవి పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. పగటిపూట ఎండల తీవ్రత పెరగడంతో పాటు, సాయంత్రం వేళల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తూ వాతావరణ అనిశ్చితి నెలకొంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు 38 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ వరకు చేరుకుంటున్నాయని వెల్లడించారు. ఈ నెల 10వ తేదీ తర్వాతే రుతుపవనాల్లో మళ్లీ కదలిక వచ్చి, అవి చురుగ్గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రానున్న రెండు, మూడు రోజుల పాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వేడి వాతావరణమే కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఈ రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 36 నుంచి 40 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే, రుతుపవనాలు విస్తరించే క్రమంలో ఇలా మధ్యమధ్యలో కొన్ని రోజుల పాటు విరామం తీసుకోవడం అనేది సాధారణ ప్రక్రియేనని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వాతావరణ శాఖ నిపుణులు వివరిస్తున్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా పగటివేళల్లో ఉక్కపోత, రాత్రివేళల్లో తేలికపాటి చల్లదనం, సాయంత్రం వేళల్లో అకస్మాత్తుగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. జూన్ రెండో వారం నుంచి వర్షాలు పుంజుకుని, వ్యవసాయ పనులకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.