దేశంలో కోవిడ్ మరోసారి భయపెడుతోంది. తేలిగ్గా తీసుకోడానికి వీల్లేదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరిస్తోంది. అప్పుడే దేశవ్యాప్తంగా 4,866 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో ఏడుగురు కరోనా సోకి మరణించగా 1238 కొత్త కేసులు వెలుగుచూశాయి. అత్యధికంగా కేరళలో కరోనా సంక్రమణ కన్పిస్తోంది. ప్రస్తుతం కేరళలో కరోనా పాజిటివ్ కేసులు 1487 ఉండగా మహారాష్ట్రలో 526, గుజరాత్లో 508, ఢిల్లీలో 562, పశ్చిమ బెంగాల్లో 538, కర్ణాటకలో 436, తమిళనాడులో 213 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1238 కొత్త కేసులు నమోదు కాగా ఒక్క కేరళ నుంచి 114 కేసులు వెలుగు చూశాయి. ఇక కర్ణాటకలో 112, పశ్చిమ బెంగాల్లో 106, ఢిల్లీలో 105 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనా సోకి 7 మంది మరణించారు. వీరిలో ఆరుగురు వృద్దులు ఉన్నారు. మృతులకు ముందస్తుగా మధుమేహం, రక్తపోటు, న్యూమోనియో వంటి అనారోగ్య సమస్యలున్నట్టు వైద్యులు తెలిపారు. కోవిడ్ కేసులు ఉధృతం అవుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కోవిడ్ మాక్ డ్రిల్ నిర్వహించనుంది. ఇందులో భాగంగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వివిధ రాష్ట్రాల్లోని ఆసుపత్రుల్ని సంసిద్ధం చేస్తుంది. ఆక్సిజన్ సరఫరా, అవసరమైన మందులు అందుబాటులో ఉంచడం వంటివి పరిశీలిస్తుంది. దేశంలోని ముఖ్యమైన ఆసుపత్రుల్లో వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయో లేవో అంచనా వేస్తుంది. కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ ఎదుర్కొనేందుకు ఆసుపత్రులు ఏ మేరకు సిద్ధంగా ఉన్నాయో అంచనా వేస్తారు.
previous post