జాతీయ వార్తలు

ఎన్నికల వేళ నితీశ్ కీలక నిర్ణయం.. డిగ్రీ నిరుద్యోగులకు నెలనెలా రూ. 1000 భృతి!

  • బీహార్‌లో ముఖ్యమంత్రి స్వయం సహాయ భృతి పథకం విస్తరణ
  •  ఇకపై డిగ్రీ పాసైన నిరుద్యోగులకు కూడా ఈ పథకం వర్తింపు
  • నెలనెలా రూ.1000 చొప్పున రెండేళ్లపాటు ఆర్థిక సహాయం
  • 20-25 ఏళ్ల వయసున్న ఉద్యోగాన్వేషణలో ఉన్న యువతకు లబ్ధి
  • అసెంబ్లీ ఎన్నికల ముందు వెలువడిన కీలక ప్రభుత్వ ప్రకటన
  • ఐదేళ్లలో కోటి ఉద్యోగాలు కల్పిస్తామన్న సీఎం నితీశ్ కుమార్

బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రభుత్వం యువతను ఆకట్టుకునే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇప్పటికే అమలులో ఉన్న ‘ముఖ్యమంత్రి స్వయం సహాయ భృతి పథకం’ పరిధిని విస్తరిస్తున్నట్లు గురువారం ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఇకపై డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు కూడా ఆర్థికంగా అండ లభించనుంది.

ప్రభుత్వం తీసుకున్న ఈ కొత్త నిర్ణయం ప్రకారం ఆర్ట్స్, సైన్స్, కామర్స్ విభాగాల్లో డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులకు నెలకు రూ.1000 చొప్పున గరిష్ఠంగా రెండేళ్ల పాటు భృతి అందించనున్నారు. ఇప్పటివరకు ఈ పథకం కేవలం ఇంటర్మీడియట్ పూర్తి చేసిన నిరుద్యోగులకు మాత్రమే వర్తించేది. ప్రభుత్వ ‘7 నిశ్చయ్’ కార్యక్రమంలో భాగంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.

 ఎవరు అర్హులు?
ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే యువతకు ప్రభుత్వం కొన్ని నిబంధనలను నిర్దేశించింది.

  •  దరఖాస్తు చేసుకునే యువత వయసు 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
  •  వారు ఎలాంటి ఉన్నత చదువులు కొనసాగిస్తూ ఉండరాదు.
  •  ప్రభుత్వ, ప్రైవేట్ లేదా ఏ ఇతర రంగంలోనూ ఉద్యోగం చేస్తూ ఉండకూడదు.
  •  స్వయం ఉపాధిలో ఉన్నవారు కూడా ఈ పథకానికి అనర్హులు.

ఈ నిర్ణయంపై సీఎం నితీశ్ కుమార్ మాట్లాడుతూ “2005 నవంబర్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించడమే మా ప్రభుత్వ ప్రాధాన్యతగా ఉంది” అని తెలిపారు. రాబోయే ఐదేళ్లలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో కలిపి కోటి మంది యువతకు ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

“ఈ ఆర్థిక సాయాన్ని యువత సద్వినియోగం చేసుకుని అవసరమైన శిక్షణ పొంది, పోటీ పరీక్షలకు సిద్ధమై తమ భవిష్యత్తును సురక్షితం చేసుకుంటారని ఆశిస్తున్నాను” అని నితీశ్ కుమార్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా పేర్కొన్నారు. ఈ దూరదృష్టితో కూడిన చొరవ ద్వారా విద్యావంతులైన యువత స్వావలంబన సాధించి రాష్ట్ర, దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Related posts

వాళ్లు కూడా భారతీయులే… వాళ్లపై ఎందుకు వివక్ష?: అక్షయ్ కుమార్

Ram Narayana

లద్దాఖ్‌లో హోదా ఉద్యమం: హింసాత్మక ఘర్షణలు.. కాల్పుల్లో నలుగురి మృతి!

Ram Narayana

పార్లమెంట్ లో రాహుల్ ప్రసంగాలపై ప్రజల ఆసక్తి…!

Ram Narayana