- కేరళ పేరును ‘కేరళం’గా మార్చేందుకు కేంద్రం ఆమోదం
- కేరళ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానానికి కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్
- మలయాళ ఉచ్చారణకు అనుగుణంగా పేరు మార్పు ప్రతిపాదన
- రాజ్యాంగ సవరణ ద్వారా అధికారికంగా మారనున్న పేరు
కేరళ రాష్ట్రం పేరును అధికారికంగా ‘కేరళం’గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఈ మేరకు కేరళ రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం సమావేశమైన కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో కేరళ ప్రజల చిరకాల డిమాండ్ నెరవేరనుంది.
మలయాళ భాషలో కేరళ రాష్ట్రాన్ని ‘కేరళం’ అనే పిలుస్తారు. ఈ స్థానిక ఉచ్చారణకు అనుగుణంగా అధికారిక పేరును కూడా మార్చాలని కోరుతూ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని ప్రభుత్వం 2024 జూన్ 24న శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఈ ప్రతిపాదనకే ఇప్పుడు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. గతంలో 2023లోనూ ఇలాంటి తీర్మానం చేసిన విషయం తెలిసిందే.
కేంద్ర మంత్రివర్గం ఆమోదం తర్వాత ఈ ప్రక్రియ మరో దశకు చేరుతుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం, రాష్ట్రపతి ‘కేరళ (పేరు మార్పు) బిల్లు, 2026’ను రాష్ట్ర శాసనసభ అభిప్రాయం కోసం పంపుతారు. అక్కడి నుంచి ఆమోదం లభించాక, ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడతారు. పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందిన తర్వాత రాజ్యాంగ సవరణ ద్వారా పేరు మార్పు అధికారికంగా అమల్లోకి వస్తుంది.
వచ్చే ఏప్రిల్-మే నెలల్లో కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ నిర్ణయం వెలువడటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో ఒరిస్సాను ‘ఒడిశా’గా, పాండిచ్చేరిని ‘పుదుచ్చేరి’గా మార్చిన తరహాలోనే ఇప్పుడు కేరళ పేరు కూడా మారుతోంది.