చట్టసభల్లో మహిళలకు మూడింట ఒక వంతు రిజర్వేషన్లు కల్పించే “నారీశక్తి వందన్ అధినియం” (మహిళా రిజర్వేషన్ బిల్లు) అమలు దిశగా ప్రధాని నరేంద్ర మోదీ కీలక ముందడుగు వేశారు. 2029 సార్వత్రిక ఎన్నికలలోపే మహిళా రిజర్వేషన్లను అమలు చేసేందుకు వీలుగా, ఈ బిల్లుకు ఏకగ్రీవంగా మద్దతు ఇవ్వాలని కోరుతూ లోక్సభ, రాజ్యసభలోని అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లకు ఆయన లేఖ రాశారు. ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ బిల్లుపై చారిత్రక చర్చ జరగనుందని, దీని ఆమోదానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ బిల్లు ఆమోదం పొందడం ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేస్తుందని ప్రధాని తన లేఖలో పేర్కొన్నారు. “ఏప్రిల్ 16 నుంచి నారీశక్తి వందన్ అధినియంపై పార్లమెంట్లో చారిత్రక చర్చ జరగనుంది. ఇది మన ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఒక గొప్ప అవకాశం. అందరినీ కలుపుకొని ముందుకు సాగాలన్న మన సమిష్టి నిబద్ధతను చాటుకోవాల్సిన సమయం ఇది” అని మోదీ పేర్కొన్నారు. జాతి నిర్మాణంలో మహిళల పాత్రను ప్రశంసిస్తూ, వారు నిర్ణయాధికారంలో చురుకైన పాత్ర పోషించినప్పుడే దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుందని తెలిపారు.
2023లో పార్టీలకు అతీతంగా ఎంపీలందరూ ఈ బిల్లుకు మద్దతు పలికిన క్షణాలను ప్రధాని గుర్తుచేశారు. దేశ మహిళలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి అందరూ ఏకతాటిపై నిలిచిన ఆ సందర్భం చిరస్మరణీయమని అన్నారు. అయితే, రిజర్వేషన్ల అమలు సమయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో, నిపుణులు, రాజకీయ పార్టీలతో విస్తృత చర్చల అనంతరం ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చిందని తెలిపారు.
ప్రస్తుత ప్రతిపాదన ప్రకారం మహిళా రిజర్వేషన్ల అమలును 2027 జనాభా లెక్కలతో ముడిపెట్టకుండా, 2011 జనాభా లెక్కల ఆధారంగానే చేపట్టాలని కేంద్రం భావిస్తోంది. దీనివల్ల 2029 లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల నాటికి మహిళా కోటాను అమలు చేయడం సాధ్యమవుతుంది. “దేశవ్యాప్తంగా నారీశక్తి వందన్ అధినియం స్ఫూర్తిని అమలు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఇది మన ప్రజాస్వామ్య వ్యవస్థలకు కొత్త శక్తినిస్తుంది” అని మోదీ తన లేఖలో వివరించారు.
ఇది ఏ ఒక్క పార్టీకో, వ్యక్తికో సంబంధించిన అంశం కాదని, మహిళలు, భావి తరాల పట్ల మనందరి బాధ్యత అని ప్రధాని అన్నారు. ఈ చారిత్రక ఘట్టంలో పాలుపంచుకునే అవకాశం వదులుకోవద్దని, ఈ సవరణకు మద్దతు ఇవ్వడం ద్వారా మన ప్రజాస్వామ్య సంప్రదాయాలను మరింత బలోపేతం చేద్దామని పిలుపునిచ్చారు. పార్లమెంట్లో రాజ్యాంగ సవరణకు మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం కాబట్టి, ప్రతిపక్షాల మద్దతు ఈ బిల్లు ఆమోదానికి అత్యంత కీలకం కానుంది.