- నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించిన సింగర్ కల్పన
- ఆసుపత్రికి వచ్చిన సింగర్లు కారుణ్య, శ్రీకృష్ణ, గీతామాధురి, సునీత తదితరులు
- ఆత్మహత్యకు గల కారణంపై పోలీసుల ఆరా
ఆత్మహత్యకు యత్నించిన ప్రముఖ సినీ నేపథ్య గాయని కల్పనకు హైదరాబాదు, నిజాంపేటలోని ఓ ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స కొనసాగుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి పలువురు సినీ ప్రముఖులు ఆసుపత్రికి వచ్చారు. వీరిలో గాయనీగాయకులు శ్రీకృష్ణ, సునీత, గీతామాధురి, కారుణ్య తదితరులు ఉన్నారు. వైద్యులను అడిగి ఆమె ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు.
హైదరాబాద్లోని నిజాంపేటలో ఉంటున్న కల్పన నిన్న నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆమె ఫ్లాట్కు చేరుకుని తలుపులు బద్దలుకొట్టి ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. అయితే, ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించిన కారణాలు తెలియరాలేదు. విషయం తెలిసి హైదరాబాద్ చేరుకున్న కల్పన భర్త ప్రసాద్ను పోలీసులు విచారిస్తున్నట్టు తెలిసింది.
సింగర్ కల్పన హెల్త్ బులెటిన్ విడుదల

- నిజాంపేట ప్రాంతంలోని హోలిస్టిక్ ఆసుపత్రిలో చికిత్స
- కల్పన నిద్రమాత్రలు మింగారన్న వైద్యులు
- ఊపిరితిత్తుల్లో నీరు చేరిందని వెల్లడి
టాలీవుడ్ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన సంచలనంగా మారింది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్ నిజాంపేట ప్రాంతంలోని హోలిస్టిక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కల్పన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు తాజగా హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆమె నిద్ర మాత్రలు మింగారని వైద్యులు పేర్కొన్నారు. ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతో ఆమెకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. ఆమెకు ఇన్ఫెక్షన్ ఉందని, ఆక్సిజన్ అందిస్తున్నామని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.
సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నానికి కారణం ఇదేనట..!

- పెద్ద కూతురుతో కల్పన గొడవపడ్డట్లు ప్రచారం
- హైదరాబాద్ రమ్మని కూతురిని పిలిచిన కల్పన
- రాలేనని చెప్పడంతో మనస్తాపం చెందిన సింగర్
ప్రముఖ సింగర్ కల్పన నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కల్పన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే, కల్పన ఆత్మహత్యాయత్నానికి కారణం కూతురుతో గొడవేనని సమాచారం. కల్పన పెద్ద కూతురు కేరళలో ఉంటోంది. మంగళవారం కూతురుకు ఫోన్ చేసిన కల్పన.. ఆమెను హైదరాబాద్ రావాలని కోరింది. అయితే, కేరళలోనే ఉంటానని, హైదరాబాద్ కు రానని కూతురు తెగేసి చెప్పినట్లు సమాచారం.
ఈ విషయంపై ఫోన్లో తల్లీకూతుళ్ల మధ్య వాగ్వాదం జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. కూతురితో గొడవతో మనస్తాపం చెందిన కల్పన.. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. సాయంత్రం 4:30 గంటలకు చెన్నై నుంచి భర్త ప్రసాద్ ఫోన్ చేయగా కల్పన లిఫ్ట్ చేయలేదు. పలుమార్లు ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో విల్లా సెక్రటరికి కాల్ చేసి చెప్పానని, ఆయన వెళ్లి తలుపు తట్టినా తెరవలేదని ప్రసాద్ వివరించారు. దీంతో పోలీసులకు సమాచారం అందించగా వారు వచ్చి తలుపులు బద్దలు కొట్టి లోపలకు వెళ్లారని, బెడ్ రూంలో అపస్మారక స్థితిలో ఉన్న కల్పనను హుటాహుటీన ఆసుపత్రికి తరలించారని ఆయన తెలిపారు.
గాయని కల్పన వ్యవహారంపై స్పందించిన కూతురు

- ఒత్తిడి కారణంగానే తన తల్లి నిద్రమాత్రలు అధికంగా తీసుకుందని వెల్లడి
- తన తల్లి ఆత్మహత్యాయత్నం చేయలేదని స్పష్టీకరణ
- తప్పుడు కథనాలు సృష్టించవద్దని విజ్ఞప్తి
ప్రముఖ గాయని కల్పన తన కూతురుతో గొడవ కారణంగానే ఆత్మహత్యాయత్నం చేసిందని ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారంపై కల్పన కూతురు స్పందించారు. తల్లి విషయం తెలియగానే కేరళలో ఉంటున్న కూతురు హుటాహుటీన హైదరాబాద్ చేరుకున్నారు. పోలీసులు ఆమె స్టేట్మెంట్ను రికార్డు చేశారు. ఒత్తిడి కారణంగానే తన తల్లి నిద్రమాత్రలు ఎక్కువగా తీసుకోవడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లిందంటూ కూతురు మీడియా ముందు చెప్పారు.
ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఒత్తిడి కారణంగానే ఒకింత ఎక్కువ మోతాదులో తన తల్లి నిద్రమాత్రలు తీసుకున్నదని తెలిపారు. తన తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నారని, వారు చాలా బాగా ఉంటున్నారని చెప్పారు. తన తల్లి ఆత్మహత్యాయత్నం చేయలేదని స్పష్టం చేశారు. దయచేసి తప్పుడు కథనాలు సృష్టించవద్దని మీడియాను కోరారు.
స్టేట్మెంట్ రికార్డు చేసిన పోలీసులు
తన తల్లి డాక్టర్ రాసిన నిద్రమాత్రలనే వేసుకుందని, మానసిక ప్రశాంతత కోసం వాటిని వేసుకుంటోందని పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో కల్పన కూతురు చెప్పారు. తమ కుటుంబంలో ఎలాంటి సమస్య లేదని వెల్లడించారు. తన తల్లి మానసిక ఒత్తిడికి గురవుతూ, నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నట్లు చెప్పారు.
ఆత్మహత్యాయత్నం చేసినట్టు వార్తలు.. స్పందించిన గాయని కల్పన

- తాను ఆత్మహత్యాయత్నం చేయలేదన్న కల్పన
- కూతురుతో మనస్పర్ధల వల్ల నిద్రపట్టక అధిక మొత్తంలో నిద్రమాత్రలు వేసుకున్నట్లు వెల్లడి
- ఈ ఘటనలో ఎవరి ప్రమేయం లేదని కల్పన చెప్పారన్న పోలీసులు
తన కూతురు విషయంలో తాను ఆత్మహత్యాయత్నం చేశానని జరుగుతోన్న ప్రచారంపై ప్రముఖ గాయని కల్పన స్పందించారు. తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడలేదని ఆమె తెలిపారు. తన కూతురు విషయంలో చోటు చేసుకున్న మనస్పర్థల వల్ల నిద్ర పట్టకపోవడంతో అధిక మొత్తంలో నిద్రమాత్రలు వేసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు కూకట్పల్లి హసింగ్ బోర్డు పోలీసులు ప్రెస్ నోట్ విడుదల చేశారు.
తాను ఆత్మహత్యాయత్నం చేయలేదని, ఈ ఘటనలో ఎవరి ప్రమేయం లేదని కల్పన చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిద్రమాత్రలు అధికంగా వేసుకోవడం వల్ల ఇలా జరిగిందని వెల్లడించారు.
కల్పన ఐదేళ్లుగా భర్తతో కలిసి హైదరాబాద్లో నివాసముంటున్నారని పోలీసులు వెల్లడించారు. కూతురు దయా ప్రసాద్కి, కల్పనకు చదువు విషయంలో మనస్పర్థలు వచ్చాయని తెలిపారు. హైదరాబాద్లోని ఇంటికి కల్పన ఒక్కరే వచ్చారని వెల్లడించారు. భర్త ప్రసాద్… కల్పనకు పలుమార్లు ఫోన్ చేశారని, ఆమె ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో కాలనీ వెల్ఫేర్ సభ్యులకు ఫోన్ చేశారని పోలీసులు వెల్లడించారు.
వెల్ఫేర్ సభ్యులు డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారని తెలిపారు. పోలీసులు, కాలనీ వెల్ఫేర్ సభ్యులు కలిసి తలుపు తెరిచేందుకు ప్రయత్నించారని, ఫలితం లేకపోవడంతో వెనుక వైపు ఉన్న కిచెన్ డోర్ నుండి లోనికి ప్రవేశించి, అపస్మారక స్థితిలో ఉన్న కల్పనను ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.