ఆంధ్రప్రదేశ్

నటి కాదంబరి జెత్వానీ కేసులో ఐపీఎస్ పీఎస్ఆర్‌కు హైకోర్టులో బిగ్ రిలీఫ్

  • కాదంబరీ జెత్వానీ కేసులో ఐపీఎస్ పీఎస్ఆర్ కు హైకోర్టు  మధ్యంతర ఉత్తర్వులు జారీ
  • జెత్వానీ ఫిర్యాదుతో ఐపీఎస్ లతో పాటు ఇతర పోలీసు అధికారులపై కేసు నమోదు
  • ఇతర నిందితుల పిటిషన్లతో పీఎస్ఆర్ పిటిషన్ జతచేయాలని రిజిస్ట్రీకి ఆదేశాలు

సినీనటి కాదంబరీ జెత్వానీ కేసులో ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులుకు హైకోర్టులో ఊరట లభించింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో పీఎస్ఆర్ పై తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే కేసులో ఇతర నిందితులు, ఐపీఎస్ అధికారులు కాంతిరాణా తాతా, విశాల్ గున్నీ తదితరులు వేసిన పిటిషన్లతో పీఎస్ఆర్ పిటీషన్‌ను జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ హరినాథ్ ఈ మేరకు నిన్న మధ్యంతర ఆదేశాలు జారీ చేశారు.

వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తనపై తప్పుడు కేసు నమోదు చేసి అరెస్టు చేసి వేధింపులకు గురి చేశారంటూ కాదంబరి జెత్వానీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీసులు కొద్ది నెలల క్రితం ముగ్గురు ఐపీఎస్ లతో పాటు ఇతర పోలీసు అధికారులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే కేసులో ఐపీఎస్ అధికారులు కాంతిరాణా తాతా, విశాల్ గున్నీ, ఏసీపీ కె హనుమంతరావు, సిఐ ఎం సత్యనారాయణలపై తదుపరి చర్యలు నిలుపుదల చేస్తూ హైకోర్టు ఈ ఏడాది మే నెలలోనే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కేసులో పీఎస్ఆర్ ఆంజనేయులు ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించి ఉపశమనం పొందలేకపోయారు. దీంతో పోలీసులు ఆయనను అరెస్టు చేసి కోర్టు ఆదేశాలతో జైలుకు తరలించారు. ఈ క్రమంలో తనపై కేసు కొట్టివేయాలని కోరుతూ పీఎస్ఆర్ ఆంజనేయులు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపి కీలక ఆదేశాలు ఇచ్చింది. 

Related posts

పవన్ పై మరోసారి ప్రకాశ్ రాజ్ విమర్శలు

Ram Narayana

తల్లి తండ్రి వేరు వేరు దేశాలు అందుకే రాహుల్ ఆలోచనల్లో తేడా…హర్యానా మంత్రి వివాదస్పద వ్యాఖ్యలు !

Drukpadam

రాహుల్ ను ప్రధాని చేయడమే లౌకిక వాదుల లక్ష్యమై ఉండాలి …భట్టి

Drukpadam