కబ్జాల వార్త రాస్తే చంపుతానంటూ ఎమ్మెల్యే అనుచరుడి బెదిరింపులు
కబ్జాలపై వార్తలు రాస్తున్నాడనే కారణంతో ఓ జర్నలిస్టును బూతులు తిడుతూ, చంపుతానని బెదిరించిన ఘటన బెల్లంపల్లిలో తీవ్ర కలకలం రేపుతోంది. బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్కు అనుచరుడిగా చెప్పుకునే కారుకూరి రాంచందర్ అనే వ్యక్తి, ఎన్టీవీ బెల్లంపల్లి రిపోర్టర్ రమేష్కు ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్లు దుర్భాషలాడినట్టు సమాచారం.
“నా మీద కబ్జాల వార్తలు రాస్తావా..? లం కొడకా…” అంటూ అశ్లీల పదజాలంతో విరుచుకుపడిన రాంచందర్, జర్నలిస్టును చంపేస్తానని, బొక్కలు విరగ్గొడతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులను ప్రస్తావిస్తూ అసభ్యంగా మాట్లాడినట్టు బాధిత జర్నలిస్టు ఆరోపించారు. పత్రికల్లో రాయలేని స్థాయిలో బూతుపురాణం వాడుతూ, “భూమి ఎవడు ఆపాడు..? బట్టలిప్పి రోడ్డుపై తంతా” అంటూ చెప్పలేని భాషలో దూషించాడని తెలిపారు.
ఈ ఘటన జర్నలిస్టు వర్గాల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. ప్రజాస్వామ్యంలో నాలుగో స్థంభమైన మీడియాపై దాడులు, బెదిరింపులు అసహ్యకరమని జర్నలిస్టు సంఘాలు మండిపడ్డాయి. వార్తలు రాస్తే ప్రాణభద్రత లేకుండా బెదిరించడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నాయి.
జర్నలిస్టును బూతులు తిట్టడమే కాకుండా, చంపుతానని బెదిరించిన ఎమ్మెల్యే అనుచరుడు కారుకూరి రాంచందర్పై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు సంఘాలు పోలీసు అధికారులను డిమాండ్ చేశాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, బాధిత జర్నలిస్టుకు రక్షణ కల్పించాలని కోరాయి.