Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రీడా వార్తలు

హిట్ మ్యాన్ కొడితే… మనవాళ్లు పాక్ ను కుమ్మేశారంతే…!

  • వరల్డ్ కప్ లో పాకిస్థాన్ కు చుక్కలు చూపించిన టీమిండియా
  • అహ్మదాబాద్ మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో గెలిచిన రోహిత్ సేన
  • 192 పరుగుల లక్ష్యాన్ని 30.3 ఓవర్లలో ఛేదించిన టీమిండియా
  • 86 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన కెప్టెన్ రోహిత్ శర్మ

వన్డే వరల్డ్ కప్ చరిత్రలో పాకిస్థాన్ చేతిలో ఓడిపోని రికార్డును భారత్ మరోసారి కాపాడుకుంది. రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా దాయాదుల సమరంలో 7 వికెట్ల తేడాతో ఘనంగా గెలిచింది. భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ పూర్తి ఏకపక్షంగా సాగింది. 

టీమిండియా గెలుపుతీరాలకు చేరడం ఆలస్యం… మైదానంలో వందేమాతరం గీతం మార్మోగింది. భారత ఆటగాళ్ల ముఖాల్లో విజయగర్వం తొణికిసలాడగా, పాక్ ఆటగాళ్ల ముఖాల్లో తీవ్ర నిరుత్సాహం కనిపించింది. కాగా, ఈ వరల్డ్ కప్ లో ఇది భారత్ కు వరుసగా మూడో విజయం. 

నేటి మ్యాచ్ విషయానికొస్తే… ఈ మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి పాకిస్థాన్ కు బ్యాటింగ్ అప్పగించింది. అయితే, టాపార్డర్ ఓ మోస్తరుగా రాణించినప్పటికీ, మిడిల్ ఓవర్ల నుంచి పాక్ పతనం మొదలైంది. బ్యాట్స్ మెన్ క్రీజులో నిలదొక్కుకునే లోపే వికెట్లు ఎగిరిపోయాయి. భారత బౌలర్లు బుమ్రా, సిరాజ్, పాండ్యా, కుల్దీప్, జడేజా తలా రెండు వికెట్లతో పాక్ పనిబట్టారు. టీమిండియా బౌలర్ల దాటికి పాక్ 42.5 ఓవర్లలో 191 పరుగులకు ఆలౌటైంది. ఎంతో సులువైన లక్ష్యాన్ని భారత్ 30.3 ఓవర్లలో 3 వికెట్లకు ఛేదించింది. 

కెప్టెన్ రోహిత్ శర్మ తనకు మాత్రమే సాధ్యమైన పవర్ హిట్టింగ్ తో పరుగుల మోత మోగించడం భారత్ ఇన్నింగ్స్ లో హైలైట్. రోహిత్ కేవలం 63 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సులతో 86 పరుగులు చేసి జట్టు విజయానికి బాటలు పరిచాడు. గిల్ (16), కోహ్లీ (16) తక్కువ స్కోరుకే వెనుదిరిగినప్పటికీ రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్ జోడీ నిలకడగా ఆడి పాక్ కు మ్యాచ్ ను దూరం చేసింది. శ్రేయాస్ అయ్యర్ 62 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 53 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కేఎల్ రాహుల్ 19 (నాటౌట్) పరుగులు చేశాడు. పాక్ బౌలర్లలో షహీన్ అఫ్రిది 2, హసన్ అలీ 1 వికెట్ తీశాడు. 

కాగా, వన్డే వరల్డ్ కప్ లలో పాకిస్థాన్ పై ఇది భారత్ కు 8వ విజయం. ఏ వరల్డ్ కప్ లో ఇరు జట్లు తలపడినా భారత్ దే పైచేయిగా వస్తోంది. ఆ ఆనవాయతీని రోహిత్ సేన కూడా కొనసాగించింది. ఇక, ఈ వరల్డ్ కప్ లో భారత్ తన తదుపరి మ్యాచ్ ను అక్టోబరు 19న బంగ్లాదేశ్ తో ఆడనుంది. ఈ మ్యాచ్ కు పూణేలోని ఎంసీఏ స్టేడియం వేదికగా నిలవనుంది.

నువ్వా నేనా అంటూ భారత బౌలర్ల వికెట్ల వేట…

వరల్డ్ కప్ లో భాగంగా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న సమరంలో టీమిండియా బౌలర్లు పాకిస్థాన్ జట్టును హడలెత్తించారు. టాస్ గెలిచిన రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకోగా… మిడిల్ ఓవర్ల వరకు ఓ మోస్తరు బ్యాటింగ్  ప్రదర్శన కనబర్చిన పాకిస్థాన్… అక్కడ్నించి భారత బౌలర్ల వేటకు బలైంది. 

టీమిండియా బౌలర్లు నువ్వా నేనా అంటూ పోటీ పడి మరీ పాక్ వికెట్లను పడగొట్టారు. బుమ్రా 2, సిరాజ్ 2, పాండ్యా 2, కుల్దీప్ యాదవ్ 2, జడేజా 2 వికెట్లతో పాక్ బ్యాటింగ్ లైనప్ ను కకావికలం చేశారు. శార్దూల్ ఠాకూర్ తప్ప మిగతా బౌలర్లందరూ తలా రెండు వికెట్లతో పాక్ పతనంలో పాలుపంచుకున్నారు. 

ఎన్నో ఆశలతో, వరల్డ్ కప్ లో ప్రతిసారీ భారత్ చేతిలో ఓడిపోయే తమ ట్రాక్ రికార్డును సరిదిద్దుకోవాలన్న పట్టుదలతో బరిలో దిగిన పాక్… మైదానంలోకి వచ్చేసరికి చేతులెత్తేసింది. చివరికి 42.5 ఓవర్లలో 191 పరుగులకు కుప్పకూలింది. 

పాక్ జట్టులో బాబర్ అజామ్ అత్యధికంగా 50 పరుగులు చేయగా, ఫామ్ లో ఉన్న మహ్మద్ రిజ్వాన్ 49, ఓపెనర్లు ఇమామ్ ఉల్ హక్ 36, అబ్దుల్లా షఫీక్ 20 పరుగులు చేశారు. ఈ నలుగురు మినహా మిగతా బ్యాట్స్ మెన్ పేలవంగా ఆడారు. కేవలం 36 పరుగుల వ్యవధిలో పాక్ చివరి 7 వికెట్లు కోల్పోయిందంటే ఎంత చెత్తగా ఆడారో అర్థమవుతుంది.

Related posts

నరాలు తెగే ఉత్కంఠ మ్యాచ్ లో పాక్ పై భారత్ సంచలన విజయం …

Drukpadam

100వ టెస్ట్ కు ముందు కోహ్లీకి ఆత్మీయ సత్కారం…

Drukpadam

బీసీసీఐ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా హెచ్‌సీఏ చీఫ్ అజారుద్దీన్…

Drukpadam

Leave a Comment