- నవంబర్ 7వ తేదీ ఉదయం 7 నుంచి నవంబర్ 30 సాయంత్రం ఆరున్నర వరకు నిషేధం
- ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఎగ్జిట్ పోల్స్ నిర్వహించవద్దని నోటిఫికేషన్
- ఎగ్జిట్ పోల్స్ ప్రచారం చేయడం, ప్రచురించడం కూడా చేయరాదన్న ఈసీ
దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్పై నిషేధం విధిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. నవంబర్ 7న ఉదయం ఏడు గంటల నుంచి నవంబర్ 30 సాయంత్రం ఆరున్నర గంటల వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఎగ్జిట్ పోల్స్ నిర్వహించడం, ప్రచారం చేయడం, ప్రచురించడం వంటివి చేయరాదని ఈసీ పేర్కొంది.
నిబంధనలు ఉల్లంఘించిన వారికి చట్ట ప్రకారం రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుందని ఎన్నికల సంఘం తెలిపింది. ఛత్తీస్గఢ్లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, నవంబర్ 7న తొలి దశ పోలింగ్, నవంబర్ 17న రెండో దశ పోలింగ్ నిర్వహించనున్నారు. మిజోరాంలో నవంబర్ 7న, మధ్యప్రదేశ్లో నవంబర్ 17న, రాజస్థాన్లో నవంబర్ 25న, తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి.
రేపు తెలంగాణకు ఈసీ బృందం… ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష
- సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు సతీశ్ వ్యాస్, ధర్మేంద్ర శర్మతో కూడిన బృందం రాక
- రెండు రోజుల పాటు హైదరాబాద్లో పర్యటన
- రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, ఇతర అధికారులతో సమావేశం
నోటిఫికేషన్ గడువు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘం సమీక్షించనుంది. ఇందుకు ఈసీ బృందం బుధవారం తెలంగాణకు రానుంది. సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు సతీశ్ వ్యాస్, ధర్మేంద్ర శర్మతో కూడిన బృందం రెండ్రోజుల పాటు హైదరాబాద్లో పర్యటించనుంది. ఈసీ బృందం… రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, అధికారులతో సమావేశం కానుంది. ఎన్నికల ఏర్పాట్లపై ఆరా తీయనుంది.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా ఇతర అధికారులతో కూడా ఎన్నికల సంఘం అధికారులు సమావేశం కానున్నారు. అనంతరం ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల అధికారులతో సమావేశం అవుతారు. తనిఖీలు, స్వాధీనాలపై ఎన్నికల సంఘం సమీక్ష నిర్వహించనుంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పొరుగు రాష్ట్రాల సీఎస్లు, డీజీపీలు, అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలు, సరిహద్దుల్లో చెక్ పోస్టులు, తనిఖీలు తదితరాలపై చర్చిస్తారు.