Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలుగు రాష్ట్రాలు

కోడిపందేల్లో చేతులు మారుతున్న వందల కోట్లు …

సంక్రాంతి వచ్చిందంటే చాలు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ లేనంత కోలాహలం…ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి గోదావరి జిల్లాలు కృష్ణా జిల్లాల్లో కోడిపందేలు లేకుండా ఈ పండగను ఊహించడం కష్టం …ఈ మూడు రోజులు పండగ అంతా గ్రామీణ ప్రాంతాల్లోని మామిడి,కొబ్బరి,ఇతర పొలాల్లోకి మారుతుంది …వేలాది కార్లు ,లక్షలాది ప్రజలు కోడి పందేల బరుల దగ్గరకు చేరతారు ..ఇక అక్కడ మొదలవుతుంది అసలు కథ …కోడి పుంజులు కొట్లాట ..కాళ్ళకు కత్తులు కట్టి వాటిని బరిలోకి దించితే ఇక ప్రజల నుంచి కేకేలు ,ఈలలు ,అరుపులు …కాయ్ రాజా ,కాయ్ అంటూ పందెం రాయిళ్ళు వేలు ,లక్షలు చేతులు మారుతుంటాయి…ఎత్తుడి కోడి పుంజు , దించుడు కోడి పుంజు అంటూ బెట్టింగులు…ఇక్కడే చిన్న జూదాల రాయిళ్ళు …అంతా కోలాహలం చిరు వ్యాపారుల జోరు …ఒక లెక్క ప్రకారం సుమారు 600 కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా …

బరిలో నిలిచినా పుంజుల యుద్ధం ఆశక్తికరంగా ఉంటుంది … కత్తులు దేహాన్ని తెంచుతున్న..‌ రక్తం నేలపై పారుతున్న.. క్షణ..క్షణం చావుకు చేరువవుతూ ప్రాణం పోతున్నా…తమపైన లక్షలాది రూపాయలు పందాలు కట్టిన ప్రజల అరుపులు, కేకలు ఆవేశాన్ని మరింతగా పెంచుతాయో ఏమో…కానీ…కోడిపుంజల పౌరుషాన్ని , పోరాటాన్ని చూస్తుంటే కంటిమీద రెప్పకూడ పడదు…ఎందుకంటే.. రెప్పపాటులో కత్తి వేటుకు ఏ..పుంజు కధ ముగిసిపోతుందో ఊహ కు కూడా అందదు‌‌..పందెం కోడిపుంజు… నిమిషాల్లో తనను నమ్మి పందెం కాసిని వారిని లక్షాధికారులను చేస్తుంది…, తన ప్రాణం పోయేంతవరకూ పందెంరాయుళ్ళ కోసం పోరాటం చేస్తుంది… గెలిచి..గెలిపిస్తాయి…, ఓడి..ఓడిస్తాయి..‌, లక్షల రూపాయలు కురిపిస్తాయి.., లక్షలు పోయాయని ఏడిపిస్తాయి…ఆడేవారి పరిస్థితి అటు..ఇటు అవుతుంటుంది కానీ…, పందాలు చూసేవారికి మాత్రం పందెం కోడిపుంజులు వేయ్యింతల వేడుకనిస్తాయి….

తెలుగు నేలపై సంక్రాంతి సీజన్‌ అంటే పందెంకోళ్ల పౌరుషం గుర్తొస్తుంది. పందెంలో గెలిచినా.. ఓడినా మాంసాహార ప్రియులు పుంజులను లొట్టలేసుకుని లాగిస్తుంటారు. పందెంలో ఓడిపోయిన, చనిపోయిన పుంజును తూర్పు గోదావరి జిల్లాలో ‘కోస’ అని పశ్చిమ గోదావరిలో ‘కోజ’ అని వ్యవహరిస్తారు. వీటి మాంసానికి ఎంతో డిమాండ్‌ ఉంది. ఏనుగు చచ్చినా బతికినా విలువ తగ్గదన్నట్టు పందెం పుంజైనా, పోరాటంలో మరణించిన ‘కోజ’ అయినా ధర వేలల్లో ఉంటుంది. బరువును బట్టి ఇవి రూ.4 వేల నుంచి రూ.10 వేల వరకు పలుకుతాయి.

పుష్టికరమైన ఆహారం..

పందెం కోడిని మేపినట్లు మేపామనే సామెతను బట్టి పందెం పుంజులను ఎంత శ్రద్ధగా పెంచుతారో అర్థం చేసుకోవచ్చు. శక్తి కోసం నాటు పుంజులకు ఉడకబెట్టిన మటన్, డ్రై ఫ్రూట్స్, కోడి గుడ్లు, వెల్లుల్లి లాంటి బలవర్థకమైన ఆహారాన్ని నెలల తరబడి అందిస్తారు. శరీరంలో కొవ్వు చేరకుండా తేలిగ్గా ఎగిరేందుకు వాటితో ఈత, నడక వ్యాయామాలు చేయిస్తారు. ప్రత్యేకంగా పెంచిన ఈ తరహా పుంజులు రంగు, ఎత్తు, పోరాట పటిమను బట్టి రూ.50 వేల నుంచి లక్షల్లో ధర పలికితే మిగిలినవి రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు ఉంటాయి.

ప్రత్యేకమైన రుచి..

పందెంకోళ్లను మటన్, బాదం, జీడిపప్పు, పిస్తా లాంటి ఖరీదైన మేతతో పుష్టిగా మేపి వ్యాయామాలు చేయించడం వల్ల వాటి శరీరంలో కొవ్వు లేకుండా కండ ఎక్కువగా ఉంటుంది. పందెంలో ప్రత్యర్థి పుంజుపై గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డిన సమయంలో రక్తం మరింత వేడెక్కి ప్రత్యేకమైన రుచి వస్తుందని
మాంసాహార ప్రియుల నమ్మకం. అందుకోసమే ఎంత ఖరీదైనా వెనుకాడకుండా వీటిని కొనుగోలు చేసి ఆరగిస్తారు.

బంధుమిత్రులకు వండి పెట్టి..

కొందరు పందేలరాయుళ్లు ‘కోజ’లను తమ వెంట తీసుకెళ్లిపోతే మరి కొందరు బరి బయటే అమ్మేస్తుంటారు. పుంజు బరువును బట్టి ధర పలుకుతుంది. ప్రత్యేకంగా వీటిని నిప్పులపై కాల్పించుకుని దగ్గరుండి కావాల్సిన సైజుల్లో ముక్కలు కొట్టించి మాంసాన్ని తీసుకువెళుతుంటారు. వీటిని కొనేందుకే కొందరు బరుల వద్దకు వస్తుంటారంటే అతిశయోక్తి కాదు. పందెం పూర్తి కాగానే పరుగులు తీస్తుంటారు.పండుగ నాడు ఇంటికి వచ్చిన బంధుమిత్రులకు ‘కోజ’ పుంజులను వండి పెట్టి ఆనందంగా గడుపుతారు. తెలిసిన వారికి మాంసాన్ని పంపేందుకు ఆసక్తి చూపుతారు. పందెం అనంతరం ‘కోజ’ను తమకే ఇవ్వాలని పందేలరాయుళ్లకు ముందుగానే చెబుతారు.

‘పెద్దలకు’ కానుకగా..

సంక్రాంతి సమయంలో సామాన్యులే కాకుండా కొందరు నాయకులు, ఉద్యోగులు సైతం తమ పైవారికి ‘కోజ’లను కానుకగా పంపించి ప్రసన్నం చేసుకుంటారు. పందేల నిర్వాహకులు ఒక్కో బరి నుంచి 25కిపైగా ‘కోజ’లను సేకరించి రాజకీయ నాయకులతో పాటు పోలీస్, రెవెన్యూ, పంచాయతీ, అగ్నిమాపక శాఖ అధికారులకు పంపిస్తుంటారు. స్టేషన్‌ మామూళ్ల విషయాన్ని పక్కనపెడితే తమకు ఎన్ని ‘కోజ’లు పంపాలో పోలీసులు ముందే ఇండెంట్‌ పెడతారని పందేలరాయుళ్లు అంటుంటారు.

కోట్లు కురిపిస్తున్న ‘కోజ’

‘కోజ’ల రూపంలో పండుగ మూడు రోజులూ ఒక్కొక్క బరి వద్ద రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వ్యాపారం జరుగుతుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా చిన్నా పెద్దా కలిపి దాదాపు 80 కోడిపందేల బరులు ఏర్పాటు కానుండగా ‘కోజ’లపై రూ.5 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుందని అంచనా.

కోడి పందాల్లో లేడీ బౌన్సర్స్..

ఏలూరు జిల్లాలో నిర్వహిస్తున్న కోడి పందాల బరుల్లో లేడీ బౌన్సర్స్ లను ఏర్పాటు చేసిన నిర్వాహకులు…ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణ జిల్లాల్లో జోరుగా కోడి పందాలు…దాదాపు 450కి పైగా బరుల్లో కోడి పందాలు…మురముళ్ళ, కాకినాడ రూరల్, రాజమండ్రి రూరల్, నిడదవోలు, ఉండి నియోజకవర్గాల్లోని పెద్ద కోడిపందాల బరుల్లో 25 లక్షల పైనే ఒక్కో పందెం నడిచిన వైనం …కోడిపందాలు ఆడేందుకు ఆసక్తి చూపిన వ్యాపారవేత్తలు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు

Related posts

హైదరాబాద్‌ ఉత్తరాన మరో ఎయిర్‌పోర్టు.. వచ్చే నెలలో పనుల ప్రారంభానికి సన్నాహాలు!

Ram Narayana

నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద నాటకీయ పరిణామాలు!

Ram Narayana

హీరో నాగార్జున సోదరి నాగసుశీలపై పోలీస్ కేసు నమోదు

Ram Narayana

Leave a Comment