- ప్రపంచ చరిత్ర పేరిట పుస్తకం రాసిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు
- నేడు విశాఖ గీతం వర్సిటీలో పుస్తకావిష్కరణ
- కాలం ఎప్పుడూ ఒకే రకంగా ఉండదన్న దగ్గుబాటి
- చంద్రబాబుకు, తనకు మధ్య గొడవలు గతం అని వెల్లడి
తాను రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆసక్తికరంగా ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు రావడం సంతోషదాయకమని తెలిపారు. చంద్రబాబుకు, తనకు మధ్య వైరం ఉందని అందరూ అనుకుంటుంటారని, అది నిజమేనని వెల్లడించారు.
“కానీ ఎప్పుడూ ఒకే రకంగా ఉండకూడదు కదా… అవన్నీ మర్చిపోయి కాలంతో పాటే ముందుకు వెళుతుండాలి… భవిష్యత్తు అనేది ఆశాజనకంగా ఉండేలా చూసుకోవాలి… అలాగని నాకేం కోరికలు లేవు స్వామీ! ఎవరు ఔనన్నా కాదన్నా నాకు, చంద్రబాబుకు మధ్య వైరం ఉండేది… అది గతం. వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అందరికీ మంచి జరగాలి, అందరూ బాగుండాలి అని చంద్రబాబు చేసే కృషికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను” అని దగ్గుబాటి వివరించారు.


ఈ పుస్తకం రాయడానికి చాలా విషయాలు తెలుసుకోవాల్సి వచ్చింది: దగ్గుబాటి వెంకటేశ్వరరావు

మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణ కార్యక్రమం నేడు విశాఖలో ఏర్పాటు చేశారు. ఇక్కడి గీతం వర్సిటీ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరులు హాజరయ్యారు. ప్రపంచ చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం నేతలు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు శుభాకాంక్షలు తెలిపారు.
అంతకుముందు, దగ్గుబాటి వెంకటేశ్వరావు ప్రసంగిస్తూ… ఈ పుస్తక రచనకు ముందు చాలా కృషి జరిగిందని చెప్పారు. తాను సైన్స్ విద్యార్థినని, ఎంబీబీఎస్ చదివానని వెల్లడించారు. తనకు సాంఘిక శాస్త్రం గురించి పెద్దగా తెలియదని అన్నారు. చరిత్ర తెలియకుండా పుస్తకం రాయడం ఎలా అని ఆలోచించానని, దాంతో విస్తారంగా పుస్తకాలు చదవాలని నిర్ణయించుకున్నానని దగ్గుబాటి చెప్పారు. అక్కడ్నించి పుస్తకాలు ఎక్కడ దొరికినా కొనేవాడ్నని, గొప్ప నాయకుల చరిత్రలు కూడా చదవడం మొదలుపెట్టానని వివరించారు.
కాగా, ఈ కార్యక్రమ వేదికపై తోడల్లుళ్లు చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆత్మీయ ఆలింగనం చేసుకోవడం అందరినీ ఆకర్షించింది. గతంలో ఇద్దరి మధ్య రాజకీయ విభేదాలు రావడం, దగ్గుబాటి టీడీపీకి దూరం కావడం తెలిసిందే. కాలక్రమంలో ఆయన వైసీపీలో చేరి 2019 ఎన్నికల్లో పర్చూరు నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి సాంబశివరావు చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల పుస్తకావిష్కరణ కోసం ఆహ్వానించేందుకు ఆయన చంద్రబాబు నివాసానికి రావడం చర్చనీయాంశం అయింది.
తోడల్లుడు వెంకటేశ్వరరావు ప్రతి రోజూ ఏం చేస్తాడో చెప్పిన చంద్రబాబు
06-03-2025 Thu 13:06 | Andhra

తన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. విశాఖలోని గీతం వర్సిటీ ప్రాంగణంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. వెంకటేశ్వరావు గురించి చంద్రబాబు అనేక విషయాలు చెప్పి సభకులను నవ్వించారు. వాటిలో చాలామందికి తెలియని విషయాలు కూడా ఉన్నాయి.
ఇక, ఈ పుస్తకం గురించి తన కంటే ముందే దగ్గుబాటి వెంకటేశ్వరరావు అన్ని విషయాలు చెప్పేశారని చంద్రబాబు అన్నారు. తామిద్దరం ఎన్టీఆర్ నుంచి అన్ని విషయాలు నేర్చుకున్నామని చెప్పారు. రచయిత కానటువంటి వెంకటేశ్వరరావు రచయిత అయ్యారని వ్యాఖ్యానించారు. అందుకే ఈ ప్రపంచ చరిత్ర పుస్తకం మీరే రాశారా? అని అడిగానని చంద్రబాబు తెలిపారు. ఎవరూ చేయనంత సాహసం ఆయన చేశారని వివరించారు.
“వెంకటేశ్వరరావు జీవితాన్ని ఒకసారి పరిశీలిస్తే… ఆయన ఒక డాక్టర్. కానీ ప్రాక్టీస్ చేయలేదు. మంత్రి అయ్యాక డాక్టర్ గా ప్రాక్టీస్ చేశాడు. ఆయనకు వైద్య ఆరోగ్య శాఖ ఇస్తే అప్పుడు ప్రాక్టీస్ చేశాడు. మళ్లీ డాక్టర్ గా చేసి సినిమాలు తీశాడు. జీవితాలు ఎలా ఉంటాయనే దానికి ఉదాహరణ. ఐదు సార్లు ఎమ్మెల్యేగా చేశాడు. మంత్రిగా ఉన్నాడు. ఒకసారి లోక్ సభకు వెళ్లాడు, రాజ్యసభకు వెళ్లాడు.
ఇటీవల వెంకటేశ్వరరావును చూస్తే చాలా రిలాక్స్ డ్ గా కనిపించారు. ఆయన చాలా సరదాగా ఉండే మనిషి. ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ ఎంతో హుషారుగా ఉంటారు. ఇలా ఎలా ఉండగలుగుతున్నారు అని ఇటీవలే కలిసినప్పుడు ఆయనను అడిగాను… నిద్ర లేవగానే బ్యాడ్యింటన్ ఆడతాను, మళ్లీ ఇంటికి వచ్చి మనవలతో ఆడుకుంటాను… ఆ తర్వాత ఫ్రెండ్స్ ను కలుస్తుంటాను అని చెప్పాడు.
మళ్లీ మధ్యాహ్నం అయితే పేకాటకు కూడా వెళతాడట. అక్కడొక రెండు గంటలు ఆడితే మైండ్ స్టిమ్యులేట్ అవుతుంది అని చెప్పాడు. హ్యాపీగా వచ్చి నిద్రపోతానని చెప్పాడు… పిల్లలకు రాత్రి పడుకునే ముందు ఒక కథ చెప్పి తాను కూడా నిద్రపోతాడు… వాట్ ఏ వండ్రఫుల్ లైఫ్! అటువంటి వ్యక్తి ఐదు పుస్తకాలు రాశాడు… అవన్నీ కూడా ఎంతో అధ్యయనం చేసి రాసిన పుస్తకాలు” అని చంద్రబాబు వివరించారు.