CM Chandrababu
ఆంధ్రప్రదేశ్

అమరావతి ఇక ఆగదు

  • రాజధాని పనులు మే 2న ప్రధాని మోదీ చేతుల మీదుగా పునఃప్రారంభం
  • రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుకు సన్నాహాలు
  • ప్రపంచ ప్రఖ్యాత వర్సిటీలు అమరావతికి రాబోతున్నాయి
  • ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

అమరావతి ఇక ఆగదని, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి ఎలాంటి ఢోకా లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా రాజధాని నిర్మాణ పనులు పునఃప్రారంభమవుతాయని చెప్పారు. తాను మాటలు చెప్పే వ్యక్తిని కాదని, ప్రజలకు మేలు చేసి చూపిస్తానని అన్నారు. అమరావతి విట్ వర్సిటీలో ‘వి లాంచ్‌పాడ్ 2025 –  స్టార్టప్ ఎక్స్ పో’లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. క్యాంపస్‌లో మహాత్మాగాంధీ, వి.వి.గిరి, దుర్గాబాయి దేశ్ ముఖ్ బ్లాక్‌లను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి సీఎం చంద్రబాబు మాట్లాడారు. తనపై అపారమైన నమ్మకంతో 29 వేల మంది రైతులు దాదాపు 34 వేల ఎకరాల భూమిని రాజధాని నిర్మాణం కోసం స్వచ్ఛందంగా ఇచ్చారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములయ్యేందుకు రైతులు ముందుకు రావడం ప్రశంసనీయమని కొనియాడారు. దివంగత ప్రధాని, తెలుగు బిడ్డ పీవీ నరసింహారావు 1991లో ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలను తాను అందిపుచ్చుకుని, భవిష్యత్తు ఐటీ రంగంలోనే ఉందని ముందుగానే గుర్తించి, దానికి అధిక ప్రాధాన్యత ఇచ్చానని చంద్రబాబు తెలిపారు. ఆ దూరదృష్టితోనే హైదరాబాద్‌లో కేవలం14 నెలల్లో హైటెక్ సిటీని నిర్మించామని తెలిపారు. ప్రస్తుతం తమ దృష్టి అంతా అమరావతిపైనే కేంద్రీకృతమైందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. త్వరలోనే అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయనున్నట్లు కీలక ప్రకటన చేశారు. అంతే కాకుండా, అమెరికాలోని సిలికాన్ వ్యాలీకి దీటుగా ఇక్కడ ‘క్వాంటమ్ వ్యాలీ’ ఏర్పాటుకు కూడా పునాది వేస్తున్నామని వెల్లడించారు. “ఒకప్పుడు నేను ఐటీ గురించి మాట్లాడితే కొందరికి అర్థం కాలేదు. ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి ప్రస్తావిస్తే, అదేమిటని కొందరు అడుగుతున్నారు” అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త (ఎంట్రప్రెన్యూర్) తయారు కావాలన్నదే తన ఆకాంక్ష అని ఆయన తెలిపారు. అమరావతిలో ఇప్పటికే విట్, ఎస్‌ఆర్‌ఎం వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయని, భవిష్యత్తులో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన విశ్వవిద్యాలయాలు కూడా ఇక్కడికి రానున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. రాజధాని కోసం భూములిచ్చి త్యాగాలు చేసిన 29 వేల మంది రైతులు, రైతు కూలీలకు అండగా నిలవాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని ఆయన ఉద్ఘాటించారు. రైతులకు మరింత చేయూతనివ్వడంలో భాగంగా, వారిలో కొందరిని దత్తత తీసుకుని సహకరించాలని తాను విట్ యూనివర్సిటీ ఛాన్సలర్ జి. విశ్వనాథన్‌ను కోరినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.

Related posts

నెల్లూరు ‘లేడీ డాన్’ అరుణపై పీడీ యాక్ట్.. కడప జైలుకు తరలింపు…

Ram Narayana

విద్యార్థుల తరలింపుపై కేంద్రం చర్యలు బాగున్నాయ్: సీజేఐ జస్టిస్ రమణ

Drukpadam

అహ్మ‌దాబాద్‌లో అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యాల‌ను త‌ల‌ద‌న్నేలా రైల్వే స్టేష‌న్‌…

Drukpadam