అంతర్జాతీయం

ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లన్నీ ఆపేసి … ఓ బంకర్ లో తలదాచుకుంటున్న ఖమేనీ!

  • ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా జోక్యంతో ఖమేనీకి భారీ భద్రత
  • ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ రహస్య బంకర్‌కు తరలింపు
  • టెహ్రాన్‌లోని అణు స్థావరాలపై అమెరికా దాడుల భయంతో అప్రమత్తత

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చడం, ఈ వివాదంలో అమెరికా కూడా జోక్యం చేసుకోవడంతో ఇరాన్ అత్యున్నత నేత అయతొల్లా అలీ ఖమేనీ భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు. ఆయనను అత్యంత సురక్షితమైన బంకర్‌కు తరలించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి. అమెరికా దాడులను దృష్టిలో ఉంచుకునే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల శనివారం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో కొన్ని బంకర్లలో ఆశ్రయం పొందుతున్న కీలక ఇరాన్ కమాండర్లు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇరాన్ వర్గాలను మరింత ఆందోళనకు గురిచేసింది. ఈ నేపథ్యంలో, ఖమేనీ భద్రత విషయంలో ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకూడదని ఇరాన్ నిర్ణయించింది. ఆయన ఆశ్రయం పొందుతున్న ప్రదేశంలో ఎలాంటి ఎలక్ట్రానిక్ సిగ్నళ్లకు అవకాశం లేకుండా కమ్యూనికేషన్ వ్యవస్థలను పూర్తిగా నిలిపివేసినట్లు ఇరాన్ మీడియా వర్గాలు వెల్లడించాయి. అత్యంత భారీ భద్రత నడుమ, అత్యంత సురక్షితమైనదిగా భావిస్తున్న బంకర్‌లో ఖమేనీ ఉన్నారని సమాచారం. కేవలం ముగ్గురు అత్యంత సన్నిహితులు మాత్రమే ప్రస్తుత పరిస్థితులు, టెహ్రాన్ చేపట్టాల్సిన ప్రతిదాడుల వ్యూహాలపై ఆయనతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఖమేనీ ఆదేశాలను వారు సైనిక జనరళ్లకు వివరించి, యుద్ధ రంగంలోని సమాచారాన్ని తిరిగి ఆయనకు అందజేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విధమైన మౌఖిక సమాచారంపైనే ఖమేనీ ఆధారపడినట్టు అర్థమవుతోంది.

Related posts

ఇరాన్‌పై ఐరాసలో తీర్మానం.. వేలాది క్షిపణులు, డ్రోన్లు అడ్డుకున్నామన్న గల్ఫ్ దేశాలు

Ram Narayana

కుప్పకూలిన జపాన్ ప్రభుత్వం- ప్రధాని రాజీనామా

Ram Narayana

మళ్లీ తడబడిన బైడెన్.. డెమోక్రాట్లలో టెన్షన్…

Ram Narayana