ఆంధ్రప్రదేశ్

మిథున్ రెడ్డి అరెస్ట్… ఏపీ లిక్కర్ స్కాం కేసులో సంచలన పరిణామం!

  • నేడు సిట్ ఎదుట విచారణకు హాజరైన మిథున్ రెడ్డి 
  • దాదాపు 7 గంటల పాటు ప్రశ్నించిన సిట్ అధికారులు
  • అనంతరం అరెస్ట్ చేసిన వైనం
  • మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టు కుటుంబ సభ్యులకు సమాచారం

ఏపీ లిక్కర్ స్కాం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు నేడు (జులై 19) అరెస్ట్ చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక, లిక్కర్ స్కాంపై దర్యాప్తు ఆరంభం కాగా, ఇవాళ మిథున్ రెడ్డి అరెస్ట్ తో ఈ కేసు కీలక మలుపు తిరిగినట్టయింది. ఈ స్కాం వెనుక పెద్ద  తలకాయలు ఉన్నాయన్న దానికి మిథున్ రెడ్డి అరెస్ట్ నిదర్శనమని తెలుస్తోంది. ఎంపీ మిథున్ రెడ్డి ఏపీ లిక్కర్ స్కాంలో ఏ4గా ఉన్నారు. వివాదాస్పద మద్యం పాలసీ రూపకల్పనలో మిథున్ రెడ్డి కీలకపాత్ర పోషించినట్టు సిట్ గుర్తించింది. 

మిథున్ రెడ్డి ఇవాళ సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. దాదాపు ఆయనను 7 గంటల పాటు ప్రశ్నించిన సిట్ అధికారులు… మరింత సమాచారం సేకరించడం కోసం అరెస్ట్ చేశారు. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టు సిట్ వర్గాలు ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించాయి. 

అంతకుముందు మిథున్ రెడ్డికి ఏపీ హైకోర్టులోనూ, సుప్రీంకోర్టులోనూ ఎదురుదెబ్బలు తగిలాయి. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించగా, సుప్రీంకోర్టు కూడా తోసిపుచ్చింది. దాంతో ఆయన అరెస్ట్ కు మార్గం సుగమమైంది.

కాగా, లిక్కర్ స్కాంలో ఏ1గా రాజ్ కసిరెడ్డి, ఏ2గా వాసుదేవరెడ్డి, ఏ3గా సత్యప్రసాద్ ఉన్నారు. రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి ఈ కేసులో ఏ5 అని తెలిసిందే. విజయసాయి ఈ కుంభకోణంలో తనను తాను విజిల్ బ్లోయర్ ను అని చెప్పుకుంటున్నప్పటికీ, ఈ కేసులో ఆయన పాత్రపై ఎఫ్ఐఆర్ లో స్పష్టంగా పొందుపరిచినట్టు తెలుస్తోంది. 

Related posts

బుడమేరు విజయవాడకు శాపంగా మారింది: పవన్ కల్యాణ్

Ram Narayana

జయలలిత మరణంపై అనుమానాలు!

Drukpadam

వేలాది మంది సమక్షంలో డాక్టర్ పువ్వాడ నయన్ రాజ్ అపర్ణ ల ఎంగేజిమెంట్ !

Drukpadam