సుప్రీం కోర్ట్ వార్తలు

కంచ గచ్చిబౌలి గ్రీనరీ అంశంలో సుప్రీంకోర్టు సీరియస్.. ఆరు వారాల్లో ప్లాన్ ఇవ్వండి!

హైదరాబాద్ నగరానికి ఊపిరితిత్తులుగా భావించే కంచ గచ్చిబౌలి ప్రాంతంలో నరికివేసిన చెట్ల స్థానంలో తిరిగి పచ్చదనాన్ని పునరుద్ధరించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. 400 ఎకరాల భూమి విషయంలో అడవులు, వన్యప్రాణులు, సరస్సులకు ఎలాంటి నష్టం జరగకుండా చూసేలా సవరించిన ప్రణాళికను ఆరు వారాల్లోగా సమర్పించాలని స్పష్టం చేసింది.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. కోర్టు ఆదేశాల మేరకు చెట్ల నరికివేతను పూర్తిగా నిలిపివేసినట్లు తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కోర్టుకు తెలిపారు.

అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, అయితే ఆ అభివృద్ధి సుస్థిరంగా ఉండాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పర్యావరణం, వన్యప్రాణుల ప్రయోజనాలను కాపాడుతూనే అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు వస్తే గతంలో చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటామని, అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తామని తెలిపారు. అయితే సమగ్ర ప్రణాళిక తయారు కోసం ఆరు వారాల సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఇందుకు ధర్మాసనం అంగీకరించింది.

ఏం జరిగింది?

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమీపంలోని ఈ భూమిలో ఐటీ మౌలిక సదుపాయాల కల్పన కోసం తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) ద్వారా వేలం వేయాలని ప్రభుత్వం భావించింది. దీనికోసం పెద్ద ఎత్తున చెట్లను నరికివేయడంతో పర్యావరణవేత్తలు, యూనివర్సిటీ విద్యార్థులు తీవ్ర ఆందోళన చేపట్టారు. దీంతో ఈ విషయాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి ఏప్రిల్‌లో విచారణ ప్రారంభించింది.

ఏప్రిల్ 3న చెట్ల నరికివేతపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సుప్రీంకోర్టు, క్షేత్రస్థాయి పరిశీలనకు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ (సీఈసీ)ని ఆదేశించింది. జరిగిన నష్టాన్ని చూసి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన న్యాయస్థానం, గతంలో విచారణ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. నరికివేసిన అడవిని పునరుద్ధరించాలని, లేదంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు పలువురు అధికారులను జైలుకు పంపాల్సి ఉంటుందని మే నెలలో హెచ్చరించింది. మంచి ప్రతిపాదనతో వస్తే కేసును ఉపసంహరించుకుంటామని, అయితే ధ్వంసమైన అడవిని మాత్రం కచ్చితంగా పునరుద్ధరించాలని కోర్టు స్పష్టం చేసింది.

Related posts

వివేకా హత్య కేసు.. ట్రయల్ కోర్టుకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. సునీత పిటిషన్ కొట్టివేత

Ram Narayana

గవర్నర్లకు గడువు.. కీలక తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు!

Ram Narayana

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో ఊరట… మధ్యంతర బెయిల్ మంజూరు

Ram Narayana