
- లద్దాఖ్లో హింసాత్మకంగా మారిన రాష్ట్ర హోదా ఉద్యమం
- లెహ్ పట్టణంలో పోలీసుల కాల్పుల్లో నలుగురు పౌరుల మృతి
- నిరసనకారులు, భద్రతా సిబ్బంది మధ్య తీవ్ర ఘర్షణలు
- బీజేపీ కార్యాలయం, పలు వాహనాలపై ఆందోళనకారుల దాడి
- అక్టోబర్ 6న కేంద్రంతో చర్చలు జరగనుండగా హింసాత్మక ఘటనలు
- రెండు వారాలుగా సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష
- బీజేపీ కార్యాలయానికి, పోలీసు వాహనాలకు నిప్పు
లద్దాఖ్లో ప్రత్యేక రాష్ట్ర హోదా కోసం జరుగుతున్న శాంతియుత ఆందోళనలు హింసాత్మక రూపం దాల్చాయి. ఈ రోజు లెహ్ పట్టణంలో నిరసనకారులు, భద్రతా సిబ్బంది మధ్య జరిగిన తీవ్ర ఘర్షణల్లో నలుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.
రాష్ట్ర హోదా, రాజ్యాంగపరమైన రక్షణ కల్పించాలన్న డిమాండ్లతో ఆందోళనకారులు ఈరోజు బంద్కు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో వందలాది మంది వీధుల్లోకి వచ్చి నిరసన చేపట్టగా, అది కాస్తా హింసకు దారితీసింది. ఆందోళనకారులు పోలీసులతో ఘర్షణకు దిగడమే కాకుండా, స్థానిక బీజేపీ కార్యాలయంపైనా, పోలీసు వాహనంతో సహా పలు వాహనాలపైనా దాడికి పాల్పడినట్టు సమాచారం. లద్దాఖ్ హోదా ఉద్యమంలో హింస చెలరేగడం ఇదే తొలిసారి.
అక్టోబర్ 6న కేంద్ర ప్రభుత్వంతో లద్దాఖ్ ప్రతినిధులు చర్చలు జరపాల్సి ఉండగా, ఈ హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం గమనార్హం. ఇదే డిమాండ్లతో ప్రముఖ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్చుక్ గత రెండు వారాలుగా నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే.
2019లో జమ్మూకశ్మీర్ నుంచి విడదీసి లద్దాఖ్ను కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసిన తర్వాత, అక్కడి ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. తమ భూమి, సంస్కృతి, వనరులకు రక్షణ లేకుండా పోతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే బౌద్ధులు అధికంగా ఉండే లెహ్, ముస్లింలు అధికంగా ఉండే కార్గిల్ ప్రాంతాలకు చెందిన రాజకీయ, మతపరమైన బృందాలు కలిసికట్టుగా పోరాటం చేస్తున్నాయి.
ఈ డిమాండ్లపై కేంద్రంతో పలు దఫాలు చర్చలు జరిగినా అవి విఫలమయ్యాయి. ఈ ఏడాది మార్చిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిగిన సమావేశం కూడా అర్ధాంతరంగా ముగిసింది. లద్దాఖ్ను కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసి తప్పు చేశానని, రాష్ట్ర హోదా డిమాండ్ను తిరస్కరించారని హోంమంత్రి తమతో అన్నట్లుగా సమావేశంలో పాల్గొన్న ఒక నాయకుడు ఆరోపించారు. తాజా హింసాత్మక ఘటనలతో లద్దాఖ్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
జమ్ము కశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం 2019 ఆగస్టు 5న రద్దు చేసింది. ఆ రాష్ట్రాన్ని జమ్ముకశ్మీర్, లడక్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఆ తర్వాత నుంచి రాష్ట్ర హోదా పునరుద్ధరణ కోసం డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర హోదా, రాజ్యాంగపరమైన భద్రతలు కల్పించాలనే డిమాండ్తో ఆందోళనకారులు లెహ్ వీధుల్లోకి వచ్చారు.
రాష్ట్ర హోదా డిమాండ్ నెరవేరే వరకు నిరాహార దీక్ష చేస్తామని లెహ్ అపెక్స్ బాడీ (ఎల్ఏబీ) ప్రకటించింది. రాష్ట్ర ఏర్పాటు కోసం లెహ్ అపెక్స్ బాడీ సెప్టెంబర్ 10 నుండి నిరాహార దీక్షకు పిలుపునిచ్చింది.
ప్రజల డిమాండ్లపై చర్చించేందుకు లడక్ ప్రతినిధులు అక్టోబర్ 6న సమావేశానికి రావాలని కేంద్రం ఆహ్వానించిన నేపథ్యంలో ఈ ఆందోళనలు చోటు చేసుకోవడం గమనార్హం. ఇదిలా ఉండగా, రాష్ట్ర హోదా కోసం పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ రెండు వారాలుగా నిరసన దీక్ష చేస్తున్నారు. లడక్ను ఆరో షెడ్యూల్ కింద చేర్చాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.