బిజినెస్ వార్తలు

ఎవరికీ అందనంత ఎత్తులో మస్క్.. 500 బిలియన్ డాలర్ల సంపదతో సరికొత్త చరిత్ర!

  • టెస్లా షేర్ల దూకుడుతో భారీగా పెరిగిన సంపద
  • రెండో స్థానంలో ఒరాకిల్ లారీ ఎలిసన్
  • భారత్‌లో మోడల్ వై కార్ల డెలివరీలు ప్రారంభం
  • ఢిల్లీలో రెండో షోరూంను ప్రారంభించిన టెస్లా
  • మస్క్ ఏఐ స్టార్టప్ ఎక్స్ఏఐ విలువ 75 బిలియన్ డాలర్లు

టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ప్రపంచ చరిత్రలోనే అరుదైన రికార్డు సృష్టించారు. 500 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 41.5 లక్షల కోట్లు) నికర సంపదను సాధించిన తొలి వ్యక్తిగా నిలిచారు. ఫోర్బ్స్ బిలియనీర్ల సూచీ ప్రకారం బుధవారం అమెరికా కాలమానం ప్రకారం సాయంత్రం 4:15 గంటలకు మస్క్ సంపద 500.1 బిలియన్ డాలర్లకు చేరింది.

ఈ ఏడాది టెస్లా కంపెనీ షేర్ల విలువ 14 శాతానికి పైగా పెరగడమే మస్క్ సంపద భారీగా వృద్ధి చెందడానికి ప్రధాన కారణం. ఒక్క బుధవారమే టెస్లా షేర్ విలువ 3.3 శాతం పెరగడంతో ఆయన సంపదకు 6 బిలియన్ డాలర్లకు పైగా జతచేరింది. మస్క్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ ఎక్స్ఏఐ విలువ కూడా జులై నాటికి 75 బిలియన్ డాలర్లుగా ఉంది. భవిష్యత్తులో ఈ కంపెనీ విలువను 200 బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ప్రపంచ కుబేరుల జాబితాలో మస్క్ తర్వాత ఒరాకిల్ వ్యవస్థాపకుడు లారీ ఎలిసన్ రెండో స్థానంలో ఉన్నారు. ఆయన సంపద విలువ సుమారు 350.7 బిలియన్ డాలర్లు. గత నెలలో ఒరాకిల్ షేర్ల ధర పెరగడంతో ఎలిసన్ కొద్దికాలం పాటు మస్క్‌ను అధిగమించి ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. అయితే, మస్క్ మళ్లీ తన అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. 2021లో తొలిసారి ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచిన మస్క్, మధ్యలో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, ఎల్‌వీఎంహెచ్ అధినేత బెర్నార్డ్ ఆర్నాల్ట్‌లకు ఆ స్థానాన్ని కోల్పోయినా, గత ఏడాది తిరిగి మొదటి స్థానానికి చేరుకున్నారు.

 భారత్‌లో విస్తరిస్తున్న టెస్లా 
మరోవైపు, టెస్లా కంపెనీ భారత్‌లో తన కార్యకలాపాలను వేగవంతం చేసింది. ఇప్పటికే తన స్టాండర్డ్ మోడల్ వై కార్ల డెలివరీలను ప్రారంభించగా, త్వరలోనే లాంగ్ రేంజ్ వేరియంట్‌ను కూడా వినియోగదారులకు అందించనుంది. కొత్తగా మోడల్ వై కారు కొనుగోలు చేసిన వారికి కాంప్లిమెంటరీగా వాల్ కనెక్టర్‌ను అందిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీని ద్వారా వినియోగదారులు తమ ఇళ్ల వద్దనే సులభంగా ఛార్జింగ్ చేసుకోవచ్చు.

భారత్‌లో మోడల్ వై ప్రారంభ ధర రూ. 59.89 లక్షలుగా ఉంది. ముంబై, ఢిల్లీ నగరాల్లో టెస్లా ఛార్జింగ్ స్టేషన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఆగస్టు నెలలో ముంబై తర్వాత దేశంలోనే రెండో టెస్లా షోరూంను ఢిల్లీ ఏరోసిటీలోని వరల్డ్‌మార్క్ 3 కాంప్లెక్స్‌లో ప్రారంభించిన విషయం తెలిసిందే.

Related posts

ఐస్ క్రీంలో డిటర్జెంట్ పౌడర్, కూల్ డ్రింకుల్లో విష రసాయనాలు.. ఎక్కడంటే?

Ram Narayana

దీపావళి పండగ ముందు సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన వంటనూనె ధరలు

Ram Narayana

మళ్లీ పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలు.. రూ.1.22 లక్షలు దాటిన 10 గ్రాముల ప‌సిడి..

Ram Narayana