తెలుగు రాష్ట్రాలు

ఏపీలో 225, తెలంగాణలో 153.. అసెంబ్లీ సీట్లపై తాజా కదలిక

  • ఏపీ, తెలంగాణలో ప్రత్యేక నియోజకవర్గాల పునర్విభజనపై ఈసీ పరిశీలన
  • ఆర్టికల్ 170 సవరణ అవసరమని గతంలో స్పష్టం చేసిన సుప్రీం కోర్టు
  • జాతీయ డీలిమిటేషన్ బిల్లు రాకపోతేనే ప్రత్యేక పునర్విభజనకు అవకాశం
  • 2026 జనాభా లెక్కల తర్వాతే పెంపు ఉంటుందని గతంలో కేంద్రం వెల్లడి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రత్యేకంగా ఈ రెండు రాష్ట్రాల్లోనే సీట్లు పెంచే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో విభజన హామీ అయిన సీట్ల పెంపుపై తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014 ప్రకారం, ఏపీలో అసెంబ్లీ స్థానాలను 175 నుంచి 225కు, తెలంగాణలో 119 నుంచి 153కు పెంచాల్సి ఉంది. అయితే, 2026 తర్వాత జరిగే తొలి జనాభా గణన అనంతరమే దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని కేంద్ర ప్రభుత్వం గతంలోనే స్పష్టం చేసింది. దీనికితోడు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 170కి అనుగుణంగా విభజన చట్టంలోని సెక్షన్ 26ను సవరించకుండా సీట్ల పెంపు సాధ్యం కాదని సుప్రీం కోర్టు కూడా గతంలో ఓ తీర్పులో పేర్కొంది. ఈ రాజ్యాంగపరమైన చిక్కుముడి వల్లే ఇన్నాళ్లు ఈ ప్రక్రియ ముందుకు సాగలేదు.

ఇదిలా ఉండగా, దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ కోసం కేంద్రం ఓ కొత్త బిల్లును తీసుకురావాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆరు నెలల్లో ఈ బిల్లును పార్లమెంటు ముందుకు తెస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఒకవేళ ఆ జాతీయ బిల్లు రావడం ఆలస్యమైతే, ఏపీ పునర్విభజన చట్టం ప్రకారమే తెలుగు రాష్ట్రాల్లో సీట్లు పెంచేందుకు ఉన్న అవకాశాలను ఈసీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.  

Related posts

శ్రీవారి భక్తులకు అలర్ట్.. అంగప్రదక్షిణ టోకెన్లపై టీటీడీ కీలక నిర్ణయం…

Ram Narayana

అరెస్ట్ చేస్తే జైల్లో కూర్చుని క‌థ‌లు రాసుకుంటా: రాంగోపాల్ వర్మ!

Ram Narayana

భోరున విలపించిన నటీ అనసూయ…

Ram Narayana