- అక్రమాస్తుల కేసులో నాంపల్లి సీబీఐ కోర్టుకు వచ్చిన జగన్
- వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న జగన్ వినతిని తిరస్కరించిన కోర్టు
- సాధారణ ఎమ్మెల్యేగా కోర్టుకు హాజరైన మాజీ సీఎం
వైసీపీ అధినేత జగన్ సుమారు ఆరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సీబీఐ కోర్టు మెట్లెక్కారు. అక్రమాస్తుల కేసుకు సంబంధించి హైదరాబాద్లోని నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు ఎదుట ఆయన వ్యక్తిగతంగా హాజరయ్యారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందిన జగన్, ఎన్నికల అనంతరం కూడా అదే మినహాయింపును కొనసాగించాలని కోర్టును కోరారు. అయితే, ఆయన అభ్యర్థనను కోర్టు తిరస్కరించి, విచారణకు తప్పనిసరిగా వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది.
ఈ నేపథ్యంలోనే, జగన్ ఈరోజు న్యాయమూర్తి రఘురామ్ ముందు విచారణకు హాజరయ్యారు. జగన్ రాక సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కోర్టు ప్రాంగణంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అక్రమాస్తుల కేసుకు సంబంధించి సీబీఐ మొత్తం 11 ఛార్జ్షీట్లు దాఖలు చేసింది. ఈ కేసుల్లో తమను తొలగించాలని కోరుతూ దాఖలైన సుమారు 130 డిశ్చార్జ్ పిటిషన్లు ఇంకా కోర్టులో పెండింగ్లోనే ఉన్నాయి.
గతంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు అధికారిక కార్యక్రమాల కారణంగా జగన్ కోర్టుకు హాజరుకాలేకపోయారు. అయితే, ఇప్పుడు ఆయన సాధారణ పౌరుడిగా, సాధారణ ఎమ్మెల్యేగా విచారణను ఎదుర్కోవాల్సి వస్తోంది. కోర్టు ఆదేశాల మేరకు ఆయన క్రమం తప్పకుండా విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది.
నిమిషాల వ్యవధిలోనే ముగిసిన విచారణ… సీబీఐ కోర్టు నుంచి లోటస్ పాండ్ కు చేరుకున్న జగన్

ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో వైసీపీ అధినేత జగన్ హైదరాబాద్లోని నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. కోర్టు ప్రాంగణంలోకి వెళ్లిన తర్వాత జగన్ తొలుత వెయిటింగ్ గదిలోకి వెళ్లారు. విచారణ ప్రారంభం కాగానే, కోర్టు సిబ్బంది ‘ఏ1 వైఎస్ జగన్మోహన్ రెడ్డి’ అని పిలిచారు. వెంటనే ఆయన కోర్టు హాల్లోకి ప్రవేశించి, న్యాయమూర్తికి నమస్కరించారు. అనంతరం, న్యాయమూర్తి సూచన మేరకు హాజరు పట్టికలో సంతకం చేశారు. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే జగన్ను కోర్టు నుంచి వెళ్లేందుకు జడ్జి అనుమతించారు. విచారణ సందర్భంగా జగన్ ను జడ్జి ఎలాంటి ప్రశ్నలు అడగలేదు. కేవలం ఆయన హాజరును మాత్రమే జడ్జి పరిగణనలోకి తీసుకుని, సంతకం చేయించుకుని పంపించి వేశారు. రాబోయే రోజుల్లో పిటిషన్లపై విచారణ జరగనుంది.
కాగా, ఈ కేసులో జగన్ తదుపరి విచారణకు ఎప్పుడు హాజరు కావాలనే అంశంపై న్యాయస్థానం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు, కోర్టు నుంచి బయటకు వచ్చిన జగన్, నేరుగా హైదరాబాద్లోని తన నివాసమైన లోటస్ పాండ్కు వెళ్లారు. లోటస్ పాండ్ వద్దకు అప్పటికే పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు చేరుకున్నాయి. లోటస్ పాండ్ లోకి కేవలం కొద్ది మంది కీలక నేతలు మాత్రమే వెళ్లారు.
సీబీఐ కోర్టు గేటు వద్ద పేర్ని నాని… లోపలకు అనుమతించని పోలీసులు

వైసీపీ అధినేత జగన్ తనపై ఉన్న అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా హైదరాబాద్లోని నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో దాఖలైన ఆరు వేర్వేరు పిటిషన్లపై నేడు కోర్టు విచారణ చేపట్టింది.
విచారణ నిమిత్తం జగన్ తన ముగ్గురు న్యాయవాదులతో కలిసి కోర్టు హాలు లోపలికి వెళ్లారు. ఆయనకు మద్దతు తెలిపేందుకు వచ్చిన వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని సహా మరికొందరు నాయకులను పోలీసులు కోర్టు ప్రధాన గేటు వద్దే నిలిపివేశారు. వారిని కోర్టు ప్రాంగణంలోకి అనుమతించలేదు. దీంతో పేర్ని నాని, ఇతర నేతలు గేటు వద్దే వేచి ఉండాల్సి వచ్చింది.
ఇదే సమయంలో, పెద్ద సంఖ్యలో వైసీపీ అభిమానులు, కార్యకర్తలు పార్టీ జెండాలతో కోర్టు వద్దకు చేరుకుని హంగామా సృష్టించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు రంగ ప్రవేశం చేసి, అక్కడ గుమికూడిన వైసీపీ శ్రేణులను దూరంగా పంపించి వేశారు. ప్రస్తుతం కోర్టులో పిటిషన్లపై విచారణ కొనసాగుతోంది.
సీబీఐ కోర్టులో జగన్, సునీత.. ఎదురుపడ్డా మాటల్లేవ్, పలకరింపుల్లేవ్!

హైదరాబాద్లోని నాంపల్లి సీబీఐ కోర్టులో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఆయన కుమార్తె డాక్టర్ సునీత, అక్రమాస్తుల కేసు విచారణ నిమిత్తం వైసీపీ అధినేత ఒకే సమయంలో కోర్టుకు హాజరయ్యారు. అయితే, కోర్టు ప్రాంగణంలో ఎదురుపడినప్పటికీ జగన్ తన సోదరి సునీతను పలకరించకుండానే వెళ్లిపోవడం గమనార్హం.
వివరాల్లోకి వెళితే, వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తును కొనసాగించాలన్న పిటిషన్పై వాదనల కోసం సునీత కోర్టుకు వచ్చారు. అదే సమయంలో, తనపై ఉన్న అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా జగన్ కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో కోర్టులో సునీతను చూసినప్పటికీ, జగన్ ఆమెతో మాట్లాడకుండా, పలకరించకుండానే ముందుకు సాగిపోయారు.
ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు కీలక వ్యక్తులు, వేర్వేరు కేసుల నిమిత్తం ఒకేసారి కోర్టుకు రావడం, కనీసం పలకరించుకోకపోవడం అక్కడున్న వారిని ఆశ్చర్యపరిచింది. వివేకా హత్య కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, బాబాయ్ కుమార్తెను జగన్ పలకరించకపోవడం రాజకీయంగానూ చర్చనీయాంశంగా మారింది.
జగన్ రాక సందర్భంగా బేగంపేట ఎయిర్ పోర్టులో వైసీపీ కార్యకర్తల హల్ చల్

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గురువారం హైదరాబాద్ కు వచ్చారు. అక్రమాస్తుల కేసులో నాంపల్లిలోని సీబీఐ కోర్టులో విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్తలు, జగన్ అభిమానులు బేగంపేట ఎయిర్ పోర్ట్ వద్ద, నాంపల్లి సీబీఐ కోర్టు సమీపంలో హల్ చల్ చేశారు. వైసీపీ జెండాలు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ జగన్ కు అనుకూలంగా నినాదాలు చేశారు.
‘2029లో రప్ఫా రప్ఫా’ అంటూ జగన్ అభిమానులు నినాదాలు చేయడం వివాదాస్పదంగా మారింది. బేగంపేట ఎయిర్ పోర్టు వద్దకు భారీ సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు రావడంతో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎయిర్ పోర్టు లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేసిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
నాంపల్లి కోర్టు సమీపంలో..
అక్రమాస్తుల కేసు విచారణకు వచ్చిన జగన్ కోసం వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నాంపల్లి సీబీఐ కోర్టు వద్దకు చేరుకున్నారు. రోడ్డుపై గుంపులుగా చేరి నినాదాలు చేశారు. ‘2029లో రప్పా రప్పా’ అంటూ రాసి ఉన్న బ్యానర్లను ప్రదర్శించారు. దీంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
అక్కడ పార్టీ ముఖ్యనేతలతో చర్చలు జరిపారు …అనంతరం జగన్ బెంగుళూరుకు బయలుదేరి వెళ్లారు ..దీనిపై టీడీపీ ,జనసేన విమర్శలు గుప్పించింది …కోర్ట్ కేసులను ఎదుర్కుంటున్న జగన్ పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి కోర్టుకు హాజరు కావడం ఏమిటని వ్యంగ్యాస్త్రాలు సంధించారు …తిరిగి వాయిదాలకు రాకుండా ఎగొట్టేందుకే జగన్ ప్లాన్ ప్రకారం ప్రజలను సమీకరించారని ఆరోపణలు గుప్పించారు ..