పార్లమంట్ న్యూస్ ...

లోక్‌సభలో వీడిన ప్రతిష్టంభన.. ఓటర్ల జాబితా సవరణపై నేడు కీలక చర్చ…

  • ఓటర్ల జాబితా సవరణపై విపక్షాల తీవ్ర ఆరోపణలు
  • చర్చను ప్రారంభించనున్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ
  • ప్రభుత్వం, విపక్షాల మధ్య ఒప్పందంతో ముగిసిన వివాదం

పార్లమెంటులో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రతిష్టంభన ఎట్టకేలకు తొలగిపోయింది. ఎన్నికల సంస్కరణలు, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై లోక్‌సభలో ఈరోజు కీలక చర్చ జరగనుంది. ప్రభుత్వం, విపక్షాల మధ్య జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం ఈ విషయంపై ఏకాభిప్రాయం కుదిరింది.

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం, ఎన్నికల సంస్కరణలపై పూర్తిస్థాయి చర్చకు ప్రభుత్వం అంగీకరించింది. డిసెంబర్ 1న శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి విపక్షాలు ఈ అంశంపై చర్చకు పట్టుబడుతున్న విషయం తెలిసిందే. ఓటర్ల జాబితా సవరణ పేరుతో అణగారిన వర్గాల ఓట్లను తొలగిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ఈ అంశంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చర్చను ప్రారంభించనుండగా, ప్రభుత్వం తరపున మంత్రి రేపు (బుధవారం) సమాధానం ఇవ్వనున్నారు. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ “స్టాప్ SIR – స్టాప్ ఓట్ చోరీ” అంటూ ప్లకార్డులతో పార్లమెంట్ లోపల, బయట నిరసనలు చేపట్టారు.

వందేమాతరం 150వ వార్షికోత్సవంతో పాటు ఎన్నికల సంస్కరణలపై చర్చకు షెడ్యూల్ ఖరారైనట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ ద్వారా ధ్రువీకరించారు. 

Related posts

పార్లమెంట్ బడ్జెట్ సెషన్ తేదీలు ఖరారు అయ్యాయి.

Ram Narayana

పార్లమెంట్ లో బీజేపీ ఎంపీ తలకు గాయం.. రాహుల్ గాంధీ తోసేశాడని ఆరోపణ..

Ram Narayana

భారతీయ రైల్వేకి ఇక న్యూక్లియర్ పవర్!

Ram Narayana