జాతీయ వార్తలు

విదేశీ ప్రయాణికులకు గుడ్ న్యూస్: బంగారం తెచ్చే రూల్స్ మార్చిన కేంద్రం…

  • బంగారు ఆభరణాలపై ‘విలువ’ పరిమితి రద్దు
  • మహిళలకు 40 గ్రాములు, పురుషులకు 20 గ్రాములు
  • డ్యూటీ ఫ్రీ ఐటమ్స్ లిమిట్ రూ. 75,000కు పెంపు
  • పిల్లలకు కూడా 40 గ్రాముల వరకు వెసులుబాటు

ఏడాదికి పైగా విదేశాలలో నివసిస్తూ భారత్ కు వచ్చే భారతీయులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. దశాబ్ద కాలం నాటి పాత నిబంధనలను మారుస్తూ ‘బ్యాగేజీ నిబంధనలు-2026’ను అమల్లోకి తెచ్చింది. ఫిబ్రవరి 2వ తేదీ అర్ధరాత్రి నుంచి ఈ కొత్త రూల్స్ వర్తిస్తాయని కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (CBIC) స్పష్టం చేసింది.

ఇప్పటివరకు విదేశాల నుంచి వచ్చే మహిళలు 40 గ్రాములు, పురుషులు 20 గ్రాముల వరకు బంగారాన్ని తెచ్చుకునే వీలున్నా.. వాటి విలువపై (వరుసగా రూ. లక్ష, రూ. 50 వేలు) పరిమితి ఉండేది. ప్రస్తుతం బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో ఈ విలువ పరిమితిని కేంద్రం పూర్తిగా తొలగించింది. అంటే, నిర్ణీత బరువు లోపు ఎంత విలువైన ఆభరణాలు తెచ్చినా కస్టమ్స్ సుంకం చెల్లించాల్సిన అవసరం లేదు.

మహిళలు: 40 గ్రాముల వరకు ఆభరణాలు (విలువతో సంబంధం లేదు).
పురుషులు: 20 గ్రాముల వరకు ఆభరణాలు (విలువతో సంబంధం లేదు).
పిల్లలు (15 ఏళ్ల లోపు): 40 గ్రాముల వరకు ఆభరణాలు సుంకం లేకుండా తేవచ్చు

ఈ వెసులుబాటు కేవలం ఆభరణాలకు మాత్రమే. బంగారు బిస్కెట్లు లేదా కడ్డీలు తెస్తే నిబంధనల ప్రకారం సుంకం చెల్లించాల్సిందే.

కేవలం బంగారమే కాదు, ఇతర వస్తువుల విషయంలోనూ పరిమితులను పెంచారు.
డ్యూటీ ఫ్రీ అలవెన్స్: సాధారణ వస్తువుల పరిమితిని రూ. 50,000 నుంచి రూ. 75,000కు పెంచారు.
ల్యాప్‌టాప్/నోట్‌ప్యాడ్: 18 ఏళ్లు దాటిన ప్రయాణికులు అదనంగా ఒక కొత్త ల్యాప్‌టాప్‌ను సుంకం లేకుండా తీసుకురావచ్చు.
మద్యం & సిగరెట్లు: 2 లీటర్ల మద్యం, 100 సిగరెట్ల వరకు మినహాయింపు యథాతథంగా కొనసాగుతుంది. ఈ కొత్త నిబంధనల వల్ల ఎయిర్‌పోర్టుల్లో కస్టమ్స్ అధికారులతో ప్రయాణికులకు జరిగే వాగ్వివాదాలు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది.  

Related posts

గాలి జనార్దన్ రెడ్డిపై అనర్హత వేటు: ఎమ్మెల్యే పదవి రద్దు

Ram Narayana

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ జరగదు …కేంద్రమంత్రి కుమారస్వామి

Ram Narayana

తమిళ ప్రజలు తనను క్షమించాలన్న అమిత్ షా… ఎందుకంటే?

Ram Narayana