- సెలవులో ఉన్న డీఎస్పీ దేవరకొండ నాగవరప్రసాద్ నుంచి ఫిర్యాదు
- లడ్డూపై దుష్ప్రచారంతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆరోపణ
- మంత్రులు, మీడియా సంస్థలు, టీటీడీ అధికారులపైనా కేసు పెట్టాలని అభ్యర్థన
ఆంధ్రప్రదేశ్లో ఒక అనూహ్య ఘటన చోటుచేసుకుంది. తిరుమల లడ్డూ ప్రసాదం నాణ్యతపై జరుగుతున్న చర్చ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోందంటూ ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్పై ఓ డీఎస్పీ స్థాయి అధికారి పోలీసులకు ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ అయింది.
ప్రస్తుతం మెడికల్ లీవ్ లో ఉన్న డీఎస్పీ దేవరకొండ నాగవరప్రసాద్ ఈ మేరకు నిన్న గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఎం, డిప్యూటీ సీఎంలతో పాటు మంత్రి నారా లోకేశ్, పలు ప్రముఖ మీడియా సంస్థలు, టీటీడీ మాజీ ఈవో శ్యామలరావు, ప్రస్తుత చైర్మన్ బీఆర్ నాయుడు పేర్లను కూడా ఆయన తన ఫిర్యాదులో చేర్చారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వీరంతా లడ్డూపై దుష్ప్రచారం చేస్తూ వ్యవస్థీకృత నేరానికి పాల్పడుతున్నారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
ఈ సందర్భంగా డీఎస్పీ నాగవరప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ గతంలో శ్రీకాకుళంలో పనిచేసిన తనకు, ఆ తర్వాత అనంతపురం పీటీసీకి బదిలీ చేయడంతో అక్కడికి వెళ్లడం ఇష్టం లేక సెలవులో ఉన్నానని తెలిపారు. తాను స్వచ్చంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నట్లు వివరించారు. లడ్డూ ప్రసాదంపై చర్చల ద్వారా కోట్ల మంది భక్తుల విశ్వాసాలను దెబ్బతీశారని ఆయన ఆరోపించారు.