అంతర్జాతీయం

దుబాయ్‌లో 40 రోజులుగా ఐసీయూలో తల్లి.. రూ. 50 లక్షల ఎయిర్ అంబులెన్స్ బిల్లుతో కొడుకు ఆవేదన

ఒకప్పుడు ప్రవాసులకు, పర్యాటకులకు స్వర్గధామంగా ఉన్న దుబాయ్‌లో ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. మధ్యప్రాచ్యంలో ఇరాన్ కార్యకలాపాలు, డ్రోన్ దాడుల మోతతో ఆ నగర ప్రశాంతతకు భంగం వాటిల్లుతోంది. ఈ ఉద్రిక్తతలు అక్కడి ప్రవాస భారతీయుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. విమానాల రద్దు, పెరిగిన ఖర్చులు ఎన్నో కుటుంబాలను సంక్షోభంలోకి నెడుతున్నాయి. ఇలాంటి క్లిష్ట‌ పరిస్థితుల‌ను ఇప్పుడు  ఓ తమిళ వ్య‌క్తి ఎదుర్కొంటున్నాడు. తన‌ తల్లి ప్రాణాలను కాపాడుకునేందుకు కన్నీటి పర్యంతమవుతున్నాడు.

తమిళనాడుకు చెందిన తిలక్‌కుమార్‌, ఆయన భార్య షామిని రమేశ్‌ ఎనిమిదేళ్ల క్రితం మెరుగైన జీవితం కోసం దుబాయ్ వెళ్లారు. ఇటీవల వారిని చూసేందుకు వెళ్లిన తిలక్‌కుమార్ తల్లి తీవ్రమైన బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్‌ బారిన పడ్డారు. గత 40 రోజులుగా ఆమె అక్కడి ఆసుపత్రిలో ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. “ఇంకా కనీసం రెండు నెలల పాటు వెంటిలేటర్ అవసరమని వైద్యులు చెబుతున్నారు” అని తిలక్‌కుమార్ ఎన్డీటీవీతో మాట్లాడుతూ తన ఆవేదన వ్యక్తం చేశారు.

యుద్ధ మేఘాలు.. రూ. కోట్లలో బిల్లు.. 
ఆసుపత్రి ఖర్చులు వారిని మరింత కుంగదీస్తున్నాయి. రోజుకు సుమారు రూ. 3 లక్షల బిల్లు అవుతుండగా, ఇప్పటివరకు మొత్తం బిల్లు రూ. 1.25 కోట్లు దాటింది. రోజురోజుకూ భారం పెరుగుతుండటంతో తక్కువ ఖర్చుతో చికిత్స అందించేందుకు తల్లిని భారత్‌కు తరలించాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల‌ 4న కమర్షియల్ మెడికల్ ఎస్కార్ట్ ఫ్లైట్‌లో రూ. 7 లక్షల ఖర్చుతో తరలించేందుకు వైద్యులు అనుమతించారు. కానీ, యుద్ధ వాతావరణం కారణంగా ఆ విమానం రద్దయింది.

ప్రస్తుతం ప్రైవేట్ ఎయిర్ అంబులెన్స్ ఒక్కటే వారికి మిగిలిన మార్గం. అయితే, ఉద్రిక్తతల కారణంగా దీని ఖర్చు ఏకంగా ఏడు రెట్లు పెరిగి రూ. 50 లక్షలకు చేరింది. “మేము ఉద్యోగులం. ఇంత పెద్ద మొత్తం భరించే స్థితిలో లేము. ప్రస్తుతం మా ముందున్న అతిపెద్ద సవాలు ఎయిర్ అంబులెన్స్ కోసం రూ. 50 లక్షలు సమకూర్చడమే” అని తిలక్‌కుమార్ వాపోయారు.

డిశ్చార్జి సమయంలో బిల్లు చెల్లించాల్సి ఉండటంతో ఆసుపత్రి నుంచి కొంత డిస్కౌంట్ వస్తుందని ఆశిస్తున్నారు. అయినా కూడా భారం తగ్గడం లేదు. నిధుల సమీకరణతో పాటు ప్రస్తుత పరిస్థితుల్లో ఎయిర్ అంబులెన్స్‌ను బుక్ చేసుకోవడం కూడా కష్టంగా మారిందని షామిని తెలిపారు. సమయం గడిచిపోతుండటంతో ఆ కుటుంబం తీవ్ర ఆందోళన చెందుతోంది. ఆర్థికంగా, మానసికంగా కుంగిపోతున్నామని, దాతలు స్పందించి తన‌ తల్లిని కాపాడాలని తిలక్‌కుమార్ వేడుకుంటున్నారు.

Related posts

అమెరికాలో చరిత్ర సృష్టించిన మ‌రో భార‌తీయుడు.. సైనికుడి నుంచి మేయర్‌గా ఎదిగిన వైనం!

Ram Narayana

క్రీడా ప్రపంచాన్ని కుదిపేస్తున్న యుద్ధం.. మెస్సీ, రొనాల్డో, హామిల్టన్ షెడ్యూల్స్ గందరగోళం…

Ram Narayana

ఇంకా విడుదల కానీ యూఎస్ విద్యార్థి వీసా ఇంటర్వ్యూ స్లాట్లు.. విద్యార్థుల్లో టెన్షన్

Ram Narayana