వంట గ్యాస్ (LPG) సరఫరాపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇళ్లలో పైప్డ్ నాచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఉన్న కుటుంబాలు తమ డొమెస్టిక్ ఎల్పీజీ కనెక్షన్లను వెంటనే ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయాలని (సరెండర్) ఆదేశించింది. ఈ మేరకు లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (సరఫరా, పంపిణీ నియంత్రణ) చట్టానికి సవరణలు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
కొత్త నిబంధనల ప్రకారం, పీఎన్జీ కనెక్షన్ ఉన్న వినియోగదారులు ఇకపై ఎల్పీజీ సిలిండర్ రీఫిల్స్ పొందలేరు. అలాగే, కొత్త ఎల్పీజీ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి కూడా అనర్హులు. “పైప్డ్ గ్యాస్ కనెక్షన్ ఉన్న ఏ వ్యక్తి కూడా డొమెస్టిక్ ఎల్పీజీ కనెక్షన్ కలిగి ఉండరాదు లేదా రీఫిల్స్ తీసుకోరాదు. అలాంటి వారు వెంటనే తమ ఎల్పీజీ కనెక్షన్ను సరెండర్ చేయాలి” అని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ తన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది.
పశ్చిమాసియాలో నెలకొన్న ఘర్షణల కారణంగా అంతర్జాతీయంగా ఇంధన సరఫరా మార్గాలకు అంతరాయం ఏర్పడింది. దీంతో భారత్కు ఎల్పీజీ దిగుమతులపై తీవ్ర ప్రభావం పడి, దేశంలో సిలిండర్లపై ఒత్తిడి పెరిగింది. ప్రజలు ఆందోళనతో సాధారణం కంటే 60 శాతం అధికంగా సిలిండర్లను బుక్ చేసుకుంటున్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో పీఎన్జీ నెట్వర్క్ అందుబాటులో లేని ప్రాంతాలకు, కుటుంబాలకు ఎల్పీజీ సిలిండర్లను మళ్లించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.