తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత ముగ్గురు సరదాగా మాట్లాడుకున్నారు. మంగళవారం అసెంబ్లీలోని మెంబర్స్ లాంజ్లో ఈ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, బీజేపీ శాసనసభ్యుడు పాయల్ శంకర్ ఒకే టేబుల్పై భోజనం చేశారు. ఆ తర్వాత అక్కడే చాలాసేపు వారు మాట్లాడుకున్నారు. రెండు గంటలకు పైగా వారి మధ్య సంభాషణలు జరగడం గమనార్హం. మూడు పార్టీలకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు కలిసి సుదీర్ఘంగా మాట్లాడుకోవడం ఆసక్తిగా మారింది.
కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలంటే నాలాంటి వారి సేవలు అవసరం: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రావాలంటే తనలాంటి ఉద్యమకారుల సేవలు అవసరమని ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మంత్రి పదవి కోసం తాను పరితపించడం లేదని వ్యాఖ్యానించారు. తనకు మంత్రి పదవి ఇస్తానని పార్టీ అధిష్ఠానమే గతంలో హామీ ఇచ్చిందని వెల్లడించారు. దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తనకు తెలియదని చెప్పారు.
అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, తనకు మంత్రి పదవి ఇస్తే ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందని అన్నారు. తనకు ఏ పదవి లేకపోయినా, ప్రజల్లో తానంటే గౌరవం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఈరోజు కేటీఆర్తోనూ అసెంబ్లీ లాంజ్లో సాధారణ విషయాలనే మాట్లాడినట్లు తెలిపారు. 2018లో 12 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో చేర్చుకోవడం తప్పేనని కేటీఆర్కు చెప్పానని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తనకు ఎలాంటి ఇబ్బందిలేదని తెలిపారు. ముఖ్యమంత్రితో నిన్న ప్రత్యేకంగా భేటీ కాలేదని, ఎదురుపడితే మాట్లాడుకున్నామని స్పష్టతనిచ్చారు.