పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం కేరళ అసెంబ్లీ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపనుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే ప్రవాస కేరళీయుల భవిష్యత్తు అనిశ్చితిలో పడటంతో, ఈ అంశం ఇప్పుడు అక్కడి రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. యుద్ధ వాతావరణం కారణంగా గల్ఫ్ దేశాల్లోని ప్రవాసులు స్వదేశానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది.
గల్ఫ్ దేశాల్లో లక్షలాది మంది కేరళీయులు ఉపాధి పొందుతున్నారు. ప్రస్తుత ఉద్రిక్తతల నడుమ వారి భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రవాసులను సురక్షితంగా వెనక్కి తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవడంలో విఫలమైందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే, తాము కేంద్ర విదేశాంగ శాఖతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని అధికార పక్షం స్పష్టం చేస్తోంది.
ఈ సంక్షోభం కేవలం రాజకీయంగానే కాకుండా, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపైనా పెను ప్రభావం చూపుతోంది. ప్రవాసులు పంపే నగదు రాష్ట్ర జీడీపీలో కీలక పాత్ర పోషిస్తుంది. యుద్ధం కారణంగా వారు ఉద్యోగాలు కోల్పోయి పెద్ద ఎత్తున తిరిగి వస్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర భారం పడుతుందనే ఆందోళన నెలకొంది. మరోవైపు, ముడి చమురు ధరల పెరుగుదల వల్ల నిత్యావసరాల ధరలు పెరగడం కూడా ఓటర్లను ప్రభావితం చేస్తోంది.
ఈ పరిణామాల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రవాసుల అంశాన్ని తమ ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నాయి. ప్రవాస కేరళీయుల కోసం ప్రత్యేక ‘వార్ రూమ్’ ఏర్పాటు చేస్తామని, యుద్ధం వల్ల తిరిగి వచ్చే వారికి పునరావాసం, ఉపాధి కల్పిస్తామని తమతమ మేనిఫెస్టోల్లో హామీలు ఇస్తున్నాయి. దీంతో పశ్చిమాసియా సంక్షోభం కేరళ ఎన్నికల ఫలితాలను నిర్దేశించే కీలక అంశంగా మారింది.