
- సునామీ హెచ్చరికలు జారీ చేసిన అధికారులు
- తీర ప్రాంతంలో మూడు మీటర్ల మేర అలలు ఎగిసిపడవచ్చన్న జపాన్ మెట్రోలాజికల్ ఏజెన్సీ
- ఉత్తర జపాన్లో సన్రికు ప్రాంతంలో భూకంపం
జపాన్లో భారీ భూకంపం సంభవించింది. ఉత్తర జపాన్లో రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో భూప్రకంపనలు వచ్చాయి. దీనితో అధికారులు తీర ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంతంలో మూడు మీటర్ల మేర అలలు ఎగిసిపడవచ్చని జపాన్ మెట్రోలాజికల్ ఏజెన్సీ వెల్లడించింది. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4.54 గంటలకు ఉత్తర జపాన్లో సన్రికు ప్రాంతంలో భూకంపం సంభవించింది.
సముద్రమట్టం నుంచి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. తీర ప్రాంత ప్రజలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు సురక్షిత ప్రాంతాల్లో, ఎత్తైన ప్రదేశాల్లోనే ఉండాలని అధికారులు పౌరులకు సూచించారు. జపాన్ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా భూకంపాలు సంభవించే దేశాల్లో ఒకటి. సాధారణంగా ప్రతి సంవత్సరం దాదాపు 1,500 వరకు భూకంపాలు సంభవిస్తాయి.