- ఇరాన్ కు బాంబులు, డ్రోన్లు, యుద్ధ సామగ్రిని సరఫరా చేస్తున్నారంటూ ఆరోపణలు
- మహిళా వ్యాపారవేత్త షమీమ్ మాఫి అరెస్ట్
- ఇరాన్ తో 70 మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు ఆధారాలు
అమెరికాలో స్థిరపడిన ఇరాన్ సంతతి మహిళా వ్యాపారవేత్త షమీమ్ మాఫి (44) అరెస్టు వ్యవహారం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఇరాన్ కు బాంబులు, డ్రోన్లు, యుద్ధ సామగ్రిని సరఫరా చేసేందుకు మధ్యవర్తిత్వం వహిస్తున్నారనే ఆరోపణలపై యూఎస్ అధికారులు ఆమెను శనివారం రాత్రి లాస్ ఏంజిలెస్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. ఈమెపై ఆరోపణలు రుజువైతే దాదాపు 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
దర్యాప్తులో తేలిన దిమ్మతిరిగే నిజాలు:
ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖకు ‘మొహాజెర్-6’ (Mohajer-6) సాయుధ డ్రోన్లను సరఫరా చేసేందుకు ఆమె ఏకంగా 70 మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఆధారాలు లభించాయి. 2025లోనే ఈమె కంపెనీకి 7 మిలియన్ డాలర్ల వరకు చెల్లింపులు జరిగినట్లు కోర్టు పత్రాలు వెల్లడిస్తున్నాయి. 2022 నుండి 2025 వరకు ఆమె ఇరాన్ నిఘా విభాగంతో నేరుగా సంప్రదింపులు జరిపినట్లు ఫోన్ రికార్డులను పోలీసులు కోర్టు ముందు ఉంచారు. సూడాన్ రక్షణ శాఖకు 55 వేల బాంబు ఫ్యూజ్లను సరఫరా చేయడంలో కీలక పాత్ర పోషించినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి.