- రాష్ట్రంలో ఫిరాయింపుల సంస్కృతిని మొదలుపెట్టింది ఎవరో అందరికీ తెలుసన్న సంజయ్ కుమార్
- తాము వేరే పార్టీతో కలిసి నడవడం అవినీతి ఎలా అవుతుందని ప్రశ్న
- నియోజకవర్గ అభివృద్ధి కోసమే ప్రభుత్వంతో కలిసి నడుస్తున్నానని వ్యాఖ్య
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఉద్దేశించి చేసిన ‘క్రాస్ బ్రీడ్, హైబ్రీడ్’ వ్యాఖ్యలపై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. జగిత్యాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ. .. అసలు రాష్ట్రంలో ఫిరాయింపుల సంస్కృతిని మొదలుపెట్టింది ఎవరో ప్రజలకు బాగా తెలుసని ఎద్దేవా చేశారు. గత పదేళ్లలో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడం ‘నీతి’ అయినప్పుడు… ఇప్పుడు తాము వేరే పార్టీకి దగ్గరైతే ‘అవినీతి’ ఎలా అవుతుందని ప్రశ్నించారు.
నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి నడుస్తున్నానని, జగిత్యాల జిల్లాకు గతంలో ఎవరు ఏం చేశారో లెక్కలు తీయడానికి తాను సిద్ధమని సవాల్ విసిరారు. వచ్చే 2028 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున మళ్లీ జగిత్యాల నుంచే పోటీ చేసి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. అయితే, ప్రస్తుతం మీరు ఏ పార్టీలో ఉన్నారన్న ప్రశ్నకు మాత్రం.. “ఆ విషయం ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది” అంటూ ఆయన చాలా తెలివిగా దాటవేశారు.