- ఐప్యాక్పై జరుగుతున్న ఈడీ విచారణలో సీఎం, ఉన్నతాధికారులు జోక్యం చేసుకుంటున్నారన్న ఈడీ
- విచారణలో కలుగజేసుకోవడాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
- మమత చర్యలు ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేలా ఉన్నాయని వ్యాఖ్య
ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఇలా ప్రవర్తించే పరిస్థితి తలెత్తుతుందని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఎప్పుడూ ఊహించి ఉండరని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై అసహనం వ్యక్తం చేసింది.
మనీలాండరింగ్ వ్యవహారంలో రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ ‘ఐప్యాక్’పై జరుగుతున్న ఈడీ విచారణలో ముఖ్యమంత్రి, ఉన్నతాధికారులు నేరుగా కలుగజేసుకోవడంపై సుప్రీంకోర్టు స్పందించింది. విచారణలో కలుగజేసుకోవడం సరికాదని పేర్కొంది. మమతా బెనర్జీ చర్యలు ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేలా ఉన్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
బెంగాల్లో చోటుచేసుకున్న బొగ్గు కుంభకోణానికి సంబంధించి నమోదైన మనీలాండరింగ్ కేసును ఈడీ దర్యాప్తు చేస్తోంది. దర్యాప్తులో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఉన్నతాధికారులు జోక్యం చేసుకుంటున్నారంటూ ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇలా వ్యవహరించడం సరికాదని పేర్కొంది.
ఇది రాష్ట్రానికి, కేంద్రానికి మధ్య వివాదం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఓ ముఖ్యమంత్రి నేరుగా విచారణలో జోక్యం చేసుకోవడం సమర్థనీయం కాదని అన్నారు. ఈ అంశాన్ని రాష్ట్రానికి, కేంద్రానికి మధ్య వివాదంగా తయారు చేయవద్దని కోరింది. మీ చర్యలు ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయని మమతా బెనర్జీని ఉద్దేశించి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.